ప్రాణాలు కాపాడే దేవుళ్లే.. ఇప్పుడు ప్రాణాలు తీసే మిషన్లుగా మారారు! దేశ రాజధానిలో జరిగిన పేలుడు వెనుక భయంకరమైన నిజం ఇది.
దేశ రాజధాని దిల్లీ మరోసారి ఉగ్రవాద భయంతో కకావికలమైంది. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన వెనుక ఉన్న నెట్వర్క్ ఇప్పుడు భయానక చిత్రాన్ని బయటపెడుతోంది.
ఉగ్రవాదులుగా మారిన డాక్టర్లు!
ఈ నెట్వర్క్లో వైద్య రంగంలో ఉన్న పలువురు డాక్టర్లు ఉగ్రవాద భావజాలంలో చిక్కుకుని తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్టు ఆధారాలు బయటకొస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ మహ్మద్ ఒకప్పుడు రోగుల జీవితాలను రక్షించేవాడు.
ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసి, ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. కానీ అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదానికి బలయ్యాడు.
దిల్లీ పేలుడు.. 48 గంటల్లో 5గురు డాక్టర్లు!
జమ్మూ కశ్మీర్ పోలీసుల ఆపరేషన్లో అరెస్టైన డాక్టర్ అదీల్తో ఉమర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలింది. అదీల్, ముజమ్మిల్ వంటి వైద్యుల అరెస్ట్తో ఉమర్ పరారీలోకి వెళ్లి, చివరికి ఎర్రకోట పేలుడులో కీలక పాత్ర పోషించినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
దిల్లీలో జరిగిన ఈ భారీ పేలుడుతో పాటు, 48 గంటల్లో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్వర్క్లో ఐదుగురు వైద్యులు పాల్గొన్నట్టు కేంద్ర సంస్థలు కనుగొన్నాయి. వీరంతా జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ వంటి నిషేధిత సంస్థలతో సంబంధం కలిగిన వారేనని అధికారులు చెబుతున్నారు.
2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఎనిమిది మందిలో ముగ్గురు డాక్టర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరి వద్ద నుంచి సుమారు 2,900 కిలోల పేలుడు పదార్థాలు, అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, దిల్లీ పేలుడుకు కారణమైన కారులో కనుగొన్న శరీర భాగాలు ఉమర్వేనా అనే దానిపై డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి. పోలీసులు ఉమర్ కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఉగ్ర మహిళా విభాగంలో లేడీ డాక్టర్!
ఈ నెట్వర్క్లో మరో కీలక పేరు డా. షాహిన్ షాహిద్. లఖ్నవూకు చెందిన ఈ వైద్యురాలు, జైషే మహ్మద్ మహిళా విభాగమైన 'జమాత్ ఉల్ మొమినాత్'లో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలోని ఈ విభాగంలో షాహిన్ ప్రధాన నిర్వాహకురాలిగా పనిచేసిందని సమాచారం. మరో మహిళా వైద్యురాలు డాక్టర్ పర్వేజ్ అన్సారీని కూడా ఈ నెట్వర్క్తో సంబంధాలపై అరెస్టు చేశారు.
స్టెతస్కోప్తో కొత్త ముప్పు!
ఇటీవల 'ఆపరేషన్ సిందూర్'లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం దెబ్బతినడంతో, ఉగ్ర సంస్థలు కొత్తగా మహిళా విభాగాలను, వైద్యుల ద్వారా సమాజంలో చొరబడే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకప్పుడు “జీవితాలను రక్షించే దేవుళ్లు”గా పిలువబడిన వైద్యులు ఇప్పుడు “మరణ మిషన్లు”గా మారడం దేశ భద్రతకు ఆందోళనకర సంకేతం.
ఉగ్రవాదం ఇప్పుడు తుపాకీతో కాదు, స్టెతస్కోప్తో కొత్త రూపం ఎత్తుకుంది. దేశ భద్రతా సంస్థలు ఇప్పుడు ఈ “డాక్టర్ టెర్రరిజం” నెట్వర్క్ను ఛేదించేందుకు యుద్ధ స్థాయిలో చర్యలు ప్రారంభించాయి.

