డబ్బు, అధికారం ఉంటే చట్టాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవచ్చని విర్రవీగే అహంకారానికి ఎట్టకేలకు చెక్ పడింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్ నడిబొడ్డున కారుతో మృత్యు క్రీడ ఆడి.. ఒక పసివాడి ప్రాణాలను బలిగొన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. పోలీసుల కళ్లుగప్పి దుబాయ్కి పారిపోయిన ఆ ప్రధాన నిందితుడు.. తప్పించుకునే దారులు మూసుకుపోవడంతో చివరకు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఒక కారు ప్రమాదం, ఎన్నో డ్రామాలు, ఇంకెన్నో ట్విస్టులతో సాగిన ఈ సంచలన కేసు పూర్తి వివరాలు మీకోసం..
ఆ రాత్రి నెత్తురోడిన జూబ్లీహిల్స్ ఫుట్పాత్!
2022 మార్చి 18.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45. దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు అతివేగంగా దూసుకొచ్చిన ఒక మహీంద్రా థార్ కారు.. రోడ్డు దాటుతున్న అమాయక యాచకులపైకి మృత్యువులా దూసుకెళ్లింది. ఫుట్పాత్పై ఆశ్రయం పొందుతున్న వారిపై బలంగా ఢీకొట్టింది.
ఆ ఘోర ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్ర గాయాలపాలు కాగా.. కేవలం నాలుగున్నరేళ్ల పసిబాలుడు అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్ చేసిన వెంటనే కారులో ప్రయాణించిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, ఆ ప్రమాదానికి కారణమైన మృత్యు శకటంపై బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో.. అది ఆయన కారుగానే పోలీసులు నిర్ధారించారు.
కొడుకును కాపాడేందుకు ఎమ్మెల్యే నాటకాలు!
కారు తనదే అయినా, ప్రమాద సమయంలో అందులో తన కొడుకు రాహెల్ లేడంటూ షకీల్ బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ, పాపం ఎప్పుడూ దాగదు! బాధితుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజీలు అసలు నిజాన్ని బట్టబయలు చేశాయి.
ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవింగ్ సీట్ నుంచి లావుగా ఉన్న ఒక వ్యక్తి పారిపోయినట్లు పక్కా ఆధారాలు లభించాయి. దీంతో ఆ రోజు రాత్రి కారు నడిపింది ముమ్మాటికీ రాహెలేనని పోలీసులు పక్కాగా నిర్ధారించుకున్నారు.
మళ్లీ అదే కండకావరం.. ప్రజాభవన్ వద్ద బీభత్సం!
బాలుడి ప్రాణాలు తీసిన కేసు నుంచి తండ్రి అండతో తప్పించుకున్నాననే ధీమాతో.. రాహెల్ మరోసారి బరితెగించాడు. ఏడాది తిరిగే సరికి, సరిగ్గా 2023 డిసెంబర్ 23వ తేదీన ఏకంగా ప్రజాభవన్ వద్ద మళ్లీ కారుతో బీభత్సం సృష్టించాడు.
అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో పీకలదాకా మద్యం మత్తులో ఉన్న రాహెల్.. వేగంగా వచ్చి ప్రజాభవన్ బారికేడ్లను బలంగా ఢీకొట్టాడు. ఆ సమయంలో అతడి కారులో ఇద్దరు యువతులు, మరో ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోలీస్ స్టేషన్లో హైడ్రామా.. అమాయకుడికి బలి!
ప్రజాభవన్ వద్ద ఘటన జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు రాహెల్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ హుటాహుటిన స్టేషన్కు చేరుకున్నాడు. తన పలుకుబడితో కొడుకు రాహెల్ను విడిపించుకుపోయాడు.
అంతటితో ఆగకుండా, అతడి స్థానంలో తన ఇంట్లో పనిచేసే 'అబ్దుల్ ఆసిఫ్' అనే అమాయకుడిని నిందితుడిగా చేర్చాడు. ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పంజాగుట్ట సీఐపై అప్పట్లో సస్పెన్షన్ వేటు పడటం పెను సంచలనం రేపింది.
దుబాయ్ టూ చంచల్గూడ!
జరిగిన మోసాన్ని పసిగట్టిన పోలీస్ ఉన్నతాధికారులు.. సీసీటీవీ ఫుటేజ్లను నిశితంగా పరిశీలించారు. తన కుమారుడిని కాపాడేందుకు ఆధారాలు మాయం చేశాడని పక్కాగా నిర్ధారించి, షకీల్ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. అరెస్టు భయంతో షకీల్ తన కొడుకు రాహెల్తో సహా పోలీసులకు చిక్కకుండా దుబాయ్ పారిపోయాడు.
అయితే, తల్లి మరణంతో ఇటీవల హైదరాబాద్కు వచ్చిన షకీల్ను.. లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) ఆధారంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. తండ్రి జైలుపాలు కావడం, దేశం దాటి తప్పించుకునే దారులు మూసుకుపోవడంతో.. చివరకు రాహెల్ కూడా పోలీసుల ముందు లొంగిపోయాడు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. రాజకీయం అనే ముసుగు వేసుకుని నేరాలను కప్పిపుచ్చాలని చూస్తే.. ఎప్పటికైనా చట్టం ముందు మోకరిల్లాల్సిందే! పసివాడి ప్రాణాలు తీసిన రాహెల్కు, ఆధారాలు తారుమారు చేసిన షకీల్కు న్యాయస్థానం విధించే శిక్షే రేపటి తరానికి ఒక గట్టి గుణపాఠం కావాలి!
Also Read:
తెలంగాణలో మళ్లీ ఎన్నికల ఫీవర్.. మే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్!Siddhendra Arts Academy : వేసవిలో పిల్లల కోసం.. వరంగల్లో బెస్ట్ సమ్మర్ క్యాంప్ ఇదే!
Jeevan Reddy: సీఎం రేవంత్పై జీవన్ రెడ్డి ఫైర్
ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి సంచలన లేఖ.. సీట్ల పెంపు ఆపాల్సిందే!
డీలిమిటేషన్ పేరుతో భారీ కుట్ర.. మోదీ సర్కార్కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

