21 రోజుల నిర్బంధం, చిత్రహింసలు
పంజాబ్ సరిహద్దులో పొరపాటున పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాక్ బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. దాదాపు 21 రోజుల పాటు పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న ఆయనను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది. శారీరకంగా దాడి చేయకపోయినా, కళ్లకు గంతలు కట్టి సరిగా నిద్రపోనివ్వకుండా మానసికంగా నరకం చూపించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మూడు ప్రాంతాల్లో తిప్పుతూ మానసిక వేదన
నిర్బంధంలో ఉన్నన్ని రోజులు జవాన్ను మూడు వేర్వేరు ప్రాంతాల్లో తిప్పి, చివరికి ఒక లొకేషన్లో ఉంచారు. ప్రతిరోజూ అసభ్యకరమైన పదజాలంతో దూషించారని సమాచారం.
ఎలా చిక్కాడు?
పశ్చిమ బెంగాల్కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షా పంజాబ్లోని ఫిరోజ్పూర్ ప్రాంతంలో విధుల్లో ఉండగా స్థానిక రైతుల పంటలను కాపాడుతూ గస్తీ తిరుగుతుండేవారు. ఏప్రిల్ 23న బుధవారం కూడా కొందరు రైతులకు కాపలాగా ఉన్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఎండ వేడిమి తట్టుకోలేక దగ్గరలోని చెట్టు కిందకు వెళ్లగా అది పాకిస్థాన్ భూభాగం కావడంతో పాక్ రేంజర్లు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని భారత సైన్యానికి తెలియజేశారు.
విఫలమైన చర్చలు, కేంద్రం హామీ
జవాన్ విడుదల కోసం ఇరు దేశాల భద్రతా దళాలు ఆరుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. జవాన్ భార్య తన భర్తను విడిపించాలని కేంద్రాన్ని వేడుకున్నారు. ఆమె గర్భవతిగా ఉండగా, కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఆమెకు హామీ ఇచ్చింది. పూర్ణమ్ కుమార్ షాను క్షేమంగా తిరిగి తీసుకొస్తామని తెలిపింది. పలుమార్లు భారత అధికారులు అభ్యర్థించినా, పహల్గాం ఉగ్రదాడి తర్వాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పాక్ అతడిని వెంటనే విడుదల చేయలేదు.
విడుదల తర్వాత బయటపడిన నిజం
ఎట్టకేలకు మే 14న బుధవారం పూర్ణమ్ కుమార్ షాను పాకిస్థాన్ భారత్కు అప్పగించింది. వైద్య పరీక్షల్లో శారీరక గాయాలేమీ కనిపించలేదు. అయితే, ఒకరోజు తిరిగేసరికి పాక్ అతడిని ఏ విధంగా చిత్రహింసలకు గురిచేసిందో బయటపడింది. నిర్బంధంలో ఉన్నన్ని రోజులు పాకిస్థాన్ అధికారులు పూర్ణమ్ను మూడు ప్రాంతాల్లో తిప్పి ఒక జైలు గదిలో ఉంచారని, ఎక్కువగా కళ్లకు గంతలు కట్టి ఉంచి మాటలతో నరకం చూపించారని తెలిపారు. కనీసం నిద్రపోనివ్వకుండా, బ్రష్ కూడా చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టారు. సరిహద్దు మోహరింపులు, అక్కడ ఉన్న సీనియర్ అధికారుల వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారని, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేశారని వెల్లడించారు. జవాన్ వద్ద ఫోన్ లేకపోవడంతో వారికి ఎలాంటి సమాచారం లభించలేదని, ఈ ప్రశ్నలడిగిన అధికారులు సాధారణ దుస్తుల్లో ఉన్నారని తెలిపారు.