చీరలు, మిక్సీలు, మద్యం.. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఇవే నడుస్తున్నాయా? ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు అందింది!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో ముందే నిర్ణయించుకున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు.
ఈసీకి ఆధారాలతో సహా ఫిర్యాదు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్యం, డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేస్తోందని హరీశ్ రావు తీవ్రంగా ఆరోపించారు. లక్షకు పైగా చీరలు, మిక్సీలను ఓటర్లకు ఎరగా వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని (CEO) కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అన్ని వీడియో, ఫొటోల ఆధారాలను ఎన్నికల సంఘానికి అందజేసినట్లు తెలిపారు.
అధికారులపై చర్యలు తీసుకోవాలి
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు హరీష్ రావు చెప్పారు. సీ-విజిల్ (C-Vigil) యాప్లో ఫిర్యాదు చేసినప్పటికీ కొందరు పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికార దుర్వినియోగంపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.
కేంద్ర బలగాలను మోహరించాలి
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ, ఆ బూత్ల వివరాలను సమర్పించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా మహిళా పోలీసు అధికారులు, ఆశా, అంగన్వాడీ వర్కర్లను ఆయా చోట్ల నియమించాలని కోరామన్నారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నకిలీ ఓటర్ కార్డులపై ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ నకిలీ ఓటరు కార్డులు తయారు చేసిందని, ఇందుకు సంబంధించిన వీడియోలను ఎన్నికల అధికారికి ఇచ్చినట్లు తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం నుంచి హామీ వచ్చినట్లు హరీశ్ రావు పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఓటర్లు అధికార పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హరీశ్ రావు అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లరిగేలా తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

