తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం పూట పొగమంచు దట్టంగా కురుస్తోంది.
సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు!
రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు (10 డిగ్రీల లోపు) పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
పలు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్'
మంగళవారం ఉదయం 13 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీచేశారు. నిరుడితో పోలిస్తే ఇప్పటికే పలు జిల్లాల్లో 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్.. ఆదిలాబాద్లో అత్యల్పం
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి వణికిస్తోంది. కొన్ని ఏరియాలలో రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలాల్లో అత్యల్పంగా 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

