కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో దారుణమైన మోసం జరిగినట్లు తెలుస్తోంది! ఐదేళ్లపాటు అసలు పాలు కొనని కంపెనీ నెయ్యి ఎలా సరఫరా చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అంశంపై దర్యాప్తు చేస్తున్న సిట్ (SIT) అధికారులు కీలక విషయాలను గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో, సీబీఐ పర్యవేక్షణలో ఈ కేసును విచారిస్తున్న సిట్ పోలీసులు, షాకింగ్ అంశాలను వెలుగులోకి తెస్తున్నారు.
పాలు కొనకుండానే.. 68 లక్షల లీటర్ల నెయ్యి!
ప్రధానంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ఉత్తరాఖండ్కు చెందిన కాంట్రాక్టు సంస్థ 'భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ'.. ఐదేళ్లలో (2019-24) ఒక్కసారి కూడా పాలు, లేదా వెన్న కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో లేదని సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ ఐదేళ్లలో ఆ సంస్థ రూ.250 కోట్ల విలువైన 68 లక్షల లీటర్ల నెయ్యిని టీటీడీకి సమకూర్చింది. అయితే, ఈ సమయంలో ఒక్క లీటర్ పాలు లేదా వెన్న కొనుగోలు చేసిన దాఖలాలు, పత్రాలు ఆ సంస్థ రికార్డుల్లో లభ్యం కాలేదని సిట్ తన నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
పామాయిల్ + రసాయనాలతో నకిలీ నెయ్యి
కోట్లాది భక్తుల విశ్వాసంతో ముడిపడిన లడ్డూ తయారీలో ఈ సంస్థ కనీస ప్రమాణాలు పాటించలేదని సిట్ గుర్తించింది. పూర్తిగా రసాయినాలతో తయారు చేసిన నెయ్యినే టీటీడీకి సరఫరా చేశారని సిట్ ఆధారాలు సంపాదించినట్లు చెబుతున్నారు.
పామాయిల్తో నెయ్యి తయారు చేసి, రంగు కోసం 'బీటా కెరోటిన్' అనే రసాయనాన్ని, వాసన కోసం కొన్ని ఎసెన్స్లను వాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. స్వచ్ఛత పరీక్షలలో ఇబ్బందులు రాకుండా రసాయనాలతోనే మేనేజ్ చేసేవారని సిట్ నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం.
రిజెక్ట్ చేసిన ట్యాంకర్లకే కొత్త లేబుళ్లు!
2022లో టీటీడీ ఈ సంస్థను బ్లాక్ చేయగా, నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులతో ఇతర కంపెనీల పేర్ల ద్వారా అదే సంస్థ టీటీడీకి నెయ్యి పంపినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
అంతేకాదు, ఒకసారి నాణ్యత లేదని టీటీడీ అధికారులు నెయ్యితో వచ్చిన నాలుగు ట్యాంకర్లను తిరస్కరిస్తే, కేవలం లేబుళ్లను మార్చి, కొత్త పేర్లతో అదే ట్యాంకర్లను తిరిగి తిరుమలకు పంపారని సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైందని అంటున్నారు.
ఢిల్లీ వ్యాపారి అరెస్ట్.. వెలుగులోకి భారీ స్కామ్
సుప్రీం ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు, ఈ నకిలీ నెయ్యి తయారీకి అవసరమైన రసాయనాలను సమకూర్చిన ఢిల్లీకి చెందిన వ్యాపారిని తాజాగా అరెస్టు చేశారు. దీంతో భోలేబాబా డెయిరీ చేసిన మొత్తం మోసం బయటపడిందని అంటున్నారు.
దీన్ని దేశంలోనే అతిపెద్ద ఆహార కల్తీ నేరంగా పరిగణిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ మోసం వెలుగు చూడగా, గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు నకిలీ నెయ్యితోనే లడ్డూ ప్రసాదం తయారు చేశారనే సంచలన విషయం భక్తుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేరానికి పాల్పడిన ముఠాలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా, త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
