బ్యాంకు ఖాతాల్లో కోట్లు పెరుగుతున్నాయి.. కానీ అందులో నుంచి ఒక్క రూపాయి కూడా బయటకు తీయలేదు. మరి విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నారు? ఖర్చులు ఎలా వెళ్తున్నాయి? ఉత్తరప్రదేశ్లోని ఐటీ అధికారులకు వచ్చిన ఈ సందేహం ఇప్పుడు సంచలనంగా మారింది.
గౌతమ్ బుద్ధ నగర్ (నొయిడా) జిల్లాలో ఆదాయపు పన్ను శాఖ (Income Tax) ఓ విచిత్రమైన కేసును వెలుగులోకి తెచ్చింది. దాదాపు 40 మందికి పైగా మిలియనీర్ వ్యాపారవేత్తలకు నోటీసులు జారీ చేసింది. కారణం.. గత మూడేళ్లుగా వీరు తమ బ్యాంకు ఖాతాల నుంచి చిల్లిగవ్వ కూడా విత్డ్రా చేసుకోకపోవడమే! ఆశ్చర్యకరంగా వీరి ఖాతాల్లో బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది తప్ప, ఖర్చుల కోసం డబ్బు తీయడం లేదు.
ఖాతాలో డబ్బు సేఫ్.. బ్లాక్ మనీతో లైఫ్!
ఈ కోటీశ్వరులు బ్యాంకులోని వైట్ మనీని భద్రంగా ఉంచుకుని, లెక్కల్లో చూపని డబ్బుతో (Black Money) లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని ఐటీ శాఖ అనుమానిస్తోంది.
ఎవరు వీరు?: నోటీసులు అందుకున్న వారిలో సగానికి పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారు.
నోటీసులు: ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 142(1) కింద వీరికి నోటీసులు పంపారు. నొయిడాతో పాటు ఘజియాబాద్లోనూ 12 మందికి ఇలాంటి నోటీసులు వెళ్లాయి.
క్షవరం ఖర్చు కూడా చెప్పాల్సిందే..
ఐటీ శాఖ అడిగిన వివరాలు చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. ఇంటి ఖర్చుల నుంచి వ్యక్తిగత సరదాల వరకు ప్రతీదానికి లెక్క అడుగుతున్నారు.
ఇంటి సరుకులు: ప్రతినెలా బియ్యం, నూనె, గ్యాస్, మసాలాలకు ఎంత ఖర్చవుతోంది?
పర్సనల్: బట్టలు, బూట్లు, మేకప్, సెంట్ (Perfume), చివరకు హెయిర్ కటింగ్ (క్షవరం) ఖర్చు కూడా చెప్పాలి.
ఇతర ఖర్చులు: కరెంట్ బిల్లులు, పిల్లల స్కూల్ ఫీజులు, కారు రిపేర్లు, ఇన్సూరెన్స్, రెస్టారెంట్ బిల్లులు, బంధువులకు ఇచ్చిన గిఫ్ట్లు.. ఇలా ఏదీ వదలకుండా బ్రేక్-డౌన్ ఇవ్వాలని ఆదేశించారు.
ఒకవేళ కుటుంబంలో వేరేవరైనా ఈ ఖర్చులు భరిస్తే, వారి ఆదాయ వివరాలు, ఆధారాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. వార్షిక సమాచార రిటర్న్స్ (AIS) డేటా ఆధారంగా ఈ డొంక కదిలించారు.

