రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వస్తే మనకేంటి లాభం? సామాన్యుడికి ఈ సందేహం రావడం సహజం. ఒక భారీ పరిశ్రమ వస్తే ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి. పరోక్షంగా వేల మందికి వ్యాపారాలు దొరుకుతాయి, స్థానిక యువతకు డైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అలాంటి ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతోంది.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏకంగా రూ.1.35 లక్షల కోట్లతో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AMNS) ఇండియా సంస్థ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అసలు ఈ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు మొదలవుతుంది? దీనివల్ల ఏపీ యువతకు, ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి మేలు జరగనుంది?
మార్చి 7న భారీ శంకుస్థాపన
ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఏఎంఎన్ఎస్ సంస్థ, గ్రౌండ్లో పనులకు కూడా అంతే వేగంగా సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో వచ్చే నెల (మార్చి 7న) ఈ మెగా స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా సంస్థ యాజమాన్యం తమ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల సాకారం కాబోతోందని, శంకుస్థాపన స్థలం గూగుల్ మ్యాప్ వివరాలను సైతం పంచుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు తదితర కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2,200 ఎకరాలు.. రెండు దశలు
ఈ భారీ పరిశ్రమను ఒకేసారి కాకుండా రెండు దశల్లో (Two Phases) ఏర్పాటు చేయనున్నారు. తొలి దశ నిర్మాణానికి అవసరమైన 2,200 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం (AP Govt) ఇప్పటికే కేటాయించింది. ఎకరాకు రూ.51.39 లక్షల చొప్పున ధర నిర్ణయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా, ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు భారీ స్థాయిలో రాయితీలు, ప్రోత్సాహకాలతో కూడిన ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించింది. తొలి దశ పురోగతి ఆధారంగా రెండో దశకు అవసరమైన భూసేకరణ జరగనుంది. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఇప్పటికే అధికారులతో కలిసి నిర్మాణ స్థలాన్ని, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
యువతకు ఊపిరి.. ఏపీ ఆర్థిక ముఖచిత్రం మారే ఛాన్స్!
రూ.1.35 లక్షల కోట్లు (సుమారు 16 బిలియన్ డాలర్లు) అంటే ఏపీ బడ్జెట్లో సగానికి పైనే. ఇంత భారీ పెట్టుబడి గ్రౌండ్ అయితే, కేవలం ఆ కంపెనీకే కాదు, దానికి అనుబంధంగా పుట్టుకొచ్చే వందలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSMEs) ప్రాణం పోసినట్లే. డైరెక్ట్ స్టీల్ ప్లాంట్ జాబ్స్ తో పాటు, రవాణా, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ రంగాల్లో వేలాది మంది స్థానికులకు ఉపాధి దొరుకుతుంది. ఏపీలో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే యువతకు ఇది ఒక 'బంగారు భవిష్యత్తు' అనడంలో ఎలాంటి సందేహం లేదు!

