పాతబస్తీలో నకిలీ ఓనర్ల స్కెచ్.. అద్దె ఇళ్లతో టోకరా!

naveen
By -

పాతబస్తీలో నకిలీ ఓనర్ల స్కెచ్.. అద్దె ఇళ్లతో టోకరా!


ఈజీ మనీ కోసం మాస్టర్ స్కెచ్.. అద్దె ఇల్లే ఆయుధంగా అమాయకులకు వల!


డబ్బు సంపాదించడానికి చెమటోడ్చడం పాత పద్ధతి. రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోవాలనే ఆశ ఎంతోమందిని నేరస్తులుగా మారుస్తోంది. తాజాగా హైదరాబాద్ పాతబస్తీ వేదికగా వెలుగుచూసిన ఓ భారీ మోసం.. క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. అసలు ఇల్లు ఒకరిది.. అద్దెకు తీసుకున్నది మరొకరు.. కానీ దర్జాగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తామే ఓనర్లమంటూ అమాయకులకు ఆ ఇంటిని తనఖా పెట్టి లక్షలు దండుకున్న ఓ కరుడుగట్టిన ముఠా బాగోతం బట్టబయలైంది. టూ-లెట్ బోర్డు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయే ఈ కిలాడీ గ్యాంగ్ గుట్టును బండ్లగూడ పోలీసులు రట్టు చేశారు.


రియల్ ఎస్టేట్ బ్రోకర్లు.. క్రిమినల్స్‌గా మారిన వేళ! 


రాజేంద్రనగర్ జోన్ డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ హైటెక్ మోసానికి పక్కా స్కెచ్ వేసింది ఐదుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. బాలాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట, అలీనగర్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ ఒమర్‌ అమూది, బండ్లగూడ మహ్మద్‌నగర్‌కు చెందిన మహమ్మద్‌ బాసిత్, అలీ జాబ్రీ, బండ్లగూడకే చెందిన షాకీర్‌ హుస్సేన్‌, మరియు బార్కస్‌ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ బిన్‌ ఉస్మాన్‌ మస్కతీ.. వీరంతా కలిసి రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా పనిచేసేవారు.


అయితే ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా మందగించింది. జేబులు ఖాళీ అయ్యాయి. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ క్రిమినల్ ప్లాన్ గీశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో యజమానులు వేరే చోట ఉంటూ.. కేవలం 'టు-లెట్' బోర్డులు తగిలించి ఉన్న ఇళ్లనే తమ టార్గెట్‌గా ఎంచుకున్నారు.


పక్కా స్కెచ్.. అద్దె ఇల్లు, ఓనర్ అవతారం! 


పాతబస్తీలో ఇళ్లను తనఖా (గిర్వీ) పద్ధతిలో తీసుకోవడం చాలా సాధారణం. ఒక భారీ మొత్తం యజమానికి ఇచ్చి ఆ ఇంట్లో నివసిస్తారు. ఆ డబ్బు యజమాని తిరిగి ఇచ్చేసినప్పుడు ఇల్లు ఖాళీ చేస్తారు. సరిగ్గా ఈ ఆచారాన్నే తమ ఆయుధంగా వాడుకున్నారు ఆ ఐదుగురు కేటుగాళ్లు. ఖాళీగా ఉన్న ఇళ్లను ముందుగా అద్దెకు తీసుకుంటారు. ఆ వెంటనే నకిలీ ధ్రువపత్రాలు (ఫేక్ డాక్యుమెంట్లు) సృష్టించి, తామే ఆ ఇంటికి అసలైన యజమానులమని నమ్మిస్తారు. ఆ తర్వాత అమాయకులను టార్గెట్ చేసి ఆ ఇళ్లను భారీ మొత్తానికి తనఖాకు కట్టబెట్టి అడ్డంగా దోచేస్తారు.


ముస్స్రత్ బేగం ఉదంతం.. బయటపడ్డ బాగోతం! 


ఈ క్రమంలోనే బండ్లగూడ మహ్మద్‌నగర్‌లోని ఓ ఇంటిపై కన్నేశారు. బండ్లగూడ ప్రాంతంలోనే నివసించే మహ్మద్‌ నుస్రత్‌బేగం అనే మహిళను టార్గెట్ చేశారు. తామే ఓనర్లమని నమ్మించి ఆమె వద్ద నుంచి ఏకంగా రూ.3 లక్షలు వసూలు చేసి ఆ ఇంటిని అప్పగించారు. బాధితురాలికి ఏమాత్రం అనుమానం రాకుండా పక్కాగా బాండు పేపరు కూడా రాసిచ్చారు. వారి నటనను నిజమని నమ్మిన నుస్రత్‌ బేగం.. సంతోషంగా ఆ ఇంటిలోకి తన మకాం మార్చింది.


అసలు ఓనర్‌కు అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ముఠా ఓ మాస్టర్ మైండ్ ప్లే చేసింది. ఇంటి యజమానికి రెండు, మూడు నెలల అద్దెను ముందే అడ్వాన్స్‌గా చెల్లించేవారు. నుస్రత్ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. మూడు నెలల పాటు అంతా ప్రశాంతంగా సాగిపోయింది. కానీ మూడు నెలల తర్వాత ఇంటి అసలు యజమాని అద్దె కోసం నేరుగా ఇంటికి రావటంతో.. నుస్రత్ బేగం గుండె ఆగినంత పనైంది. అప్పుడకానీ తాను నిలువునా మోసపోయానని ఆ మహిళ గ్రహించలేకపోయింది.


రంగంలోకి పోలీసులు.. పరారీలో నలుగురు! 


లక్షల రూపాయలు కోల్పోయి రోడ్డున పడ్డ బాధితురాలు వెంటనే బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు. ఈ ముఠాలోని కీలక సభ్యుడైన షేక్‌ ఒమర్‌ అమూదిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అయితే ముందస్తు సమాచారంతో మిగతా నలుగురు నిందితులు మహమ్మద్‌ బాసిత్, అలీ జాబ్రీ, షాకీర్‌ హుస్సేన్‌, మహమ్మద్‌ బిన్‌ ఉస్మాన్‌ మస్కతీలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసుల వేట ముమ్మరంగా సాగుతోంది.


ఈజీ మనీ కోసం రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే ఆశ.. చివరికి కటకటాల పాలు చేస్తుంది అనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. అద్దె ఇల్లు తీసుకునేటప్పుడైనా, తనఖాకు వెళ్లేటప్పుడైనా అసలు యజమాని ఎవరో పదిసార్లు నిర్ధారించుకోకపోతే.. రేపు మీ ఇంటి తలుపు కూడా ఇలాగే తట్టే ప్రమాదం ఉంది జాగ్రత్త!