ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గొంతు నులమడానికి మరో ఉరితాడు సిద్ధమవుతోందా? ఎక్కడో పశ్చిమాసియాలో రగులుతున్న ఆధిపత్య పోరు.. సామాన్యుడి జేబుకు చిల్లులు పొడవడమే కాదు, మొత్తం ప్రపంచ దేశాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయబోతోంది. ఇప్పటికే హార్మూజ్ జలసంధి మూసివేతతో పెట్రోల్, గ్యాస్ ధరల మంటల్లో కాలిపోతున్న ప్రపంచానికి.. ఇప్పుడు యెమెన్ హౌతీ రెబల్స్ రూపంలో మరో అత్యంత భయంకరమైన గండం ముంచుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న మొండి వైఖరి మారకపోతే.. ఏకంగా బాబ్ అల్ మాండెబ్ జలసంధిని సైతం శాశ్వతంగా మూసేస్తామంటూ హౌతీలు చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
హార్మూజ్ మూసివేత.. భయపెడుతున్న చమురు సంక్షోభం!
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఏకమై తమపై చేస్తున్న భీకర దాడులకు ప్రతీకారంగా.. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ నిర్దాక్షిణ్యంగా మూసివేసింది. ఈ కఠిన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ముడి చమురు రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడి అంతర్జాతీయంగా భయంకరమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవల కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ జలసంధిని తెరిచినట్లు ప్రకటించిన ఇరాన్.. ఆ తర్వాత అమెరికా మొండి తీరుతో ఆగ్రహించి మళ్లీ మూసివేసింది. ఈ పరిణామంతో ప్రపంచ దేశాల్లో మరోసారి చమురు సంక్షోభ భయాలు కమ్ముకున్నాయి.
ట్రంప్కు హౌతీల వార్నింగ్.. మూస్తే ఎవరూ తెరవలేరు!
ఒకవైపు హార్మూజ్ జలసంధి మూసివేతతోనే ప్రపంచం తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్న వేళ.. తాజాగా మరో అత్యంత కీలకమైన జలసంధికి పెను ప్రమాదం ముంచుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు విధానాలను వెంటనే తగ్గించుకోకపోతే.. బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తామని యెమెన్లోని హౌతీలు సంచలన ప్రకటన చేయడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
యెమెన్, జిబౌటి దేశాల మధ్య ఉన్న ఈ బాబ్ అల్ మాండెబ్ జలసంధి.. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తుంది. ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూయజ్ కెనాల్కు వెళ్లే మార్గంలో ఉన్న అత్యంత కీలకమైన జలసంధి.
ప్రపంచ శాంతికి భంగం కలిగించేలా ట్రంప్ తన చర్యలను కొనసాగిస్తే.. తాము బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేసి తీరుతామని హౌతీ ప్రభుత్వ విదేశాంగశాఖ ఉప మంత్రి హుస్సేన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము గనుక ఒక్కసారి దీన్ని మూసివేస్తే.. తిరిగి దాన్ని ఓపెన్ చేయించడం ప్రపంచంలోని ఏ ఒక్క అగ్రరాజ్యానికి కూడా సాధ్యం కాదని ఆయన ఘాటుగా హెచ్చరించారు.
మద్దతిచ్చే దేశాలకు ముప్పు.. భగ్గుమన్న హెజ్బొల్లా!
ప్రపంచ శాంతిని చెడగొట్టి ఉద్రిక్తతలను పెంచే అన్ని చర్యలను తక్షణమే డొనాల్డ్ ట్రంప్ నిలిపివేయాలని హౌతీలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా సృష్టిస్తున్న ఈ విధ్వంసం నుంచి వెనక్కి తగ్గాలని, ఈ మహా యుద్ధంలో అమెరికాకు సహకరిస్తున్న ఇతర దేశాలు కూడా తప్పుకోవాలని, అలా చేయడమే అందరికీ మంచిదని హౌతీలు హెచ్చరించారు.
మరోవైపు.. ఇజ్రాయెల్తో లెబనాన్ చేసుకున్న ఏకపక్ష కాల్పుల విరమణ ఒప్పందం అత్యంత అవమానకరమని హెజ్బొల్లా సెక్రటరీ జనరల్ నయీమ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఒప్పందానికి హెజ్బొల్లా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు. సరిగ్గా 2024లో ఇజ్రాయెల్ను నమ్మి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసుకోగా.. ఆ దేశం ద్రోహం చేసి సామాన్య ప్రజలపై అత్యంత దారుణంగా దాడులు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
రోజుకు 93 లక్షల కోట్లు.. ఏంటి ఈ జలసంధి పవర్?
ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానించే ఈ బాబ్ అల్ మాండెబ్ జలసంధి.. గల్ఫ్ ఆఫ్ ఎడెన్, ఎర్ర సముద్రంకు మధ్య ఒక అభేద్యమైన ద్వారంలా ఉంటుంది. కేవలం 30 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ మార్గం.. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకలకు ప్రాణవాయువు లాంటిది.
ఈ జలసంధి గుండా ప్రతీ రోజు ఏకంగా 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతూ ఉంటుంది. అంతర్జాతీయంగా జరిగే మొత్తం వాణిజ్యంలో 10 నుంచి 12 శాతం కేవలం ఈ మార్గం గుండానే పయనిస్తుండటం దీని ప్రాముఖ్యతకు అద్దం పడుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ల మధ్య ఎల్ఎన్జీ, కీలక తయారీ వస్తువులు, ఆహార పదార్థాల రవాణాకు ఇది అత్యంత కీలకం. ప్రతీ సంవత్సరం ఏకంగా రూ.93.95 లక్షల కోట్ల అక్షరాలా భారీ విలువైన సరకులు ఈ జలసంధి గుండానే రవాణా అవుతున్నాయంటే.. దీని ఆధిపత్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అటు హార్మూజ్, ఇటు బాబ్ అల్ మాండెబ్.. ఈ రెండు జలసంధులు గనుక పూర్తిగా మూతపడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. పాలకుల అహంకారపు యుద్ధాలు, సామాన్యుడి బతుకును అంధకారంలోకి నెట్టేయకముందే.. అగ్రరాజ్యాలు తమ మొండి వైఖరిని వీడటం మానవాళికి అత్యంత అవసరం!

