ఢిల్లీ రాజకీయాల్లో ఊహించని పొలిటికల్ భూకంపం! ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్కు కుడిభుజంగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా వెలుగొందిన యువ కెరటం రాఘవ్ చద్ధా ఇప్పుడు సొంత పార్టీలోనే ఒంటరి పోరాటం చేస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తనను అర్ధాంతరంగా తప్పించడంపై ఆప్ అధిష్టానంపై ఆయన బాణాలు ఎక్కుపెట్టారు. మౌనంగా ఉన్నంత మాత్రాన ఓడిపోయినట్లు కాదంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు తాను చేసిన తప్పేంటో చెప్పాలంటూ రాఘవ్ చద్ధా నేరుగా పార్టీ అధినాయకత్వాన్నే నిలదీయడం ఈ ఎపిసోడ్లో సరికొత్త మలుపు!
మౌనంగా ఉన్నా.. ఓడిపోలేదు!
రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తనను అవమానకరంగా తొలగించిన మరుసటి రోజే రాఘవ్ చద్ధా సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. "నేను మౌనంగా ఉన్నాను.. కానీ నన్ను ఎవరూ ఓడించలేరు" అంటూ తనదైన శైలిలో పవర్ ఫుల్ కౌంటర్ ఇచ్చారు. సొంత పార్టీ అధిష్టానం తీరుపై ఆయన సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు తాను ఏ తప్పు చేశానో, ఎందుకు తనపై వేటు వేశారో దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
మాట్లాడనివ్వొద్దని పార్టీయే చెప్పింది!
పార్లమెంట్లో తన గొంతు నొక్కేందుకు సాక్షాత్తూ తన సొంత పార్టీయే కుట్ర పన్నిందని రాఘవ్ చద్ధా చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాజ్యసభలో తనకు మాట్లాడే అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదని ఆప్ పెద్దలే స్వయంగా రాజ్యసభ సెక్రటరీకి చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయినా సరే తనకు అవకాశం వచ్చినప్పుడల్లా సగటు మనిషి గొంతుకగా మారి ప్రజా సమస్యలనే పార్లమెంట్ వేదికగా లేవనెత్తానని ఆయన ఉద్వేగంగా వెల్లడించారు.
ప్రజా సమస్యలు మాట్లాడటమే నా తప్పా?
తాను డిప్యూటీ లీడర్గా ఉన్న సమయంలో మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తున్న పన్నుల భారం గురించి గట్టిగా మాట్లాడానని చద్ధా గుర్తుచేశారు. మొబైల్ డేటా ఎక్స్పైరీ సమస్యలు, పితృత్వ సెలవులు (పెటర్నిటీ లీవ్స్), గిగ్ వర్కర్ల దయనీయమైన పని పరిస్థితుల వంటి కీలక అంశాలపై గళమెత్తానని చెప్పారు. వీటికి సంబంధించిన వీడియోలను సైతం ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇలాంటి ప్రజా సమస్యలు లేవనెత్తితే అంతిమంగా పార్టీకే మేలు జరుగుతుంది కదా.. మరి ఆప్ నేతలు తనను ఎందుకు అడ్డుకుంటున్నారో స్పష్టం చేయాలని ఆయన నిలదీశారు. ఇలాంటి కుట్రలతో తనను ఎవరూ ఆపలేరని, ప్రజల పక్షాన నిలబడటం కోసం తాను ఎంత వరకైనా వెళ్తానని ఆయన తెగేసి చెప్పారు.
కేజ్రీవాల్తో పెరిగిన గ్యాప్.. అసలు మిస్టరీ ఇదే!
ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత ఆప్తుడిగా, నీడలా ఉన్న రాఘవ్ చద్ధాకు.. ఇప్పుడు ఆప్ అగ్రనాయకత్వానికి మధ్య భారీగా దూరం పెరిగిందన్న ప్రచారం ఢిల్లీ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. 2024లో సంచలనం సృష్టించిన లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో రాఘవ్ చద్ధా విదేశాల్లో ఉండటం పార్టీ శ్రేణులకు ఏమాత్రం రుచించలేదు. కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన చాలా రోజుల తర్వాత కానీ ఆయనను కలవకపోవడం పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Silenced, not defeated
— Raghav Chadha (@raghav_chadha) April 3, 2026
My message to the ‘aam aadmi’
—
खामोश करवाया गया हूँ, हारा नहीं हूँ
'आम आदमी’ को मेरे संदेश pic.twitter.com/poUwxsu0S3
స్వాతి మాలివాల్ తర్వాత చద్ధా వంతు!
ఇటీవల లిక్కర్ కేసు నుంచి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా పూర్తిగా విముక్తి పొందినప్పుడు కూడా చద్ధా మౌనంగానే ఉండిపోయారు. ఆప్ నిర్వహించిన భారీ సంబరాలకు, ర్యాలీలకు ఆయన ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉండటం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. గతంలో స్వాతి మాలివాల్ పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా పక్కకు తప్పుకోగా.. ఇప్పుడు ఆ జాబితాలో చేరిన రెండో రాజ్యసభ ఎంపీగా రాఘవ్ చద్ధా నిలిచారు.
ఇదొక రొటీన్ ప్రాసెస్ అంటున్న ఆప్!
అయితే, రాఘవ్ చద్ధా ఆరోపణలను ఆప్ అగ్రనాయకత్వం కొట్టిపారేస్తోంది. ఈ మార్పును తీవ్రంగా సమర్థించుకుంటోంది. రాజ్యసభలో ఇది కేవలం ఒక సాధారణ ప్రక్రియ మాత్రమే అని నూతన డిప్యూటీ లీడర్ అశోక్ మిట్టల్ స్పష్టం చేశారు. గతంలో ఎన్డీ గుప్తా స్థానంలో రాఘవ్ చద్ధాకు అవకాశం ఇచ్చామని, ఇప్పుడు అదే విధానంలో తనకు బాధ్యతలు అప్పగించారని ఆయన వివరించారు.
రాఘవ్ చద్ధాను మాట్లాడకుండా తాము ఎన్నడూ అడ్డుకోలేదని పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ నుంచి ఏడుగురు, ఢిల్లీ నుంచి ముగ్గురు.. మొత్తంగా 10 మంది సభ్యుల బలం ఉంది.
అధికారం ఉన్నచోట ఆధిపత్య పోరు సహజం.. కానీ ఒకప్పుడు కేజ్రీవాల్కు సైన్యాధిపతిలా పనిచేసిన రాఘవ్ చద్ధా, ఇప్పుడు అదే అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడం ఢిల్లీ రాజకీయాల్లో రాబోయే పెను తుఫానుకు పక్కా సంకేతం!

