ప్రపంచ శాంతి ఇప్పుడు గాల్లో దీపంలా మారింది. పాకిస్థాన్ వేదికగా ఏకంగా 21 గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగిన అగ్రరాజ్యాల హై-వోల్టేజ్ దౌత్య మహాభారతం ఎటూ తేలకుండానే ముగిసిపోయింది. శాంతి చర్చలు ఘోరంగా విఫలమయ్యాయంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని భయంతో వణికిస్తోంది. అసలు ఆ మూసిన తలుపుల వెనుక ఏం జరిగింది? వాన్స్ స్వయంగా వెల్లడించిన మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు మీకోసం!
అమెరికాకు కాదు.. ఇరాన్కే ఇది బ్యాడ్ న్యూస్!
అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన ఈ సుదీర్ఘ మథనం ఎలాంటి ఫలప్రదమైన ముగింపు లేకుండానే అర్ధాంతరంగా ముగిసిందని జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. "ఇదొక చేదు వార్త.. అయితే, ఒప్పందం కుదరకపోవడం అనేది అమెరికా కంటే ఇరాన్కే అతిపెద్ద బ్యాడ్ న్యూస్" అని ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
తమ రెడ్ లైన్స్ (పరిమితులు) ఏంటో, ఏయే విషయాల్లో తాము సర్దుకుపోతామో, వేటిలో అస్సలు రాజీ పడమో ఇరాన్కు అత్యంత స్పష్టంగా చెప్పేశామన్నారు. తాము చెప్పాల్సింది ముఖం మీద చెప్పినట్లు స్పష్టంగా చెప్పినా.. ఇరాన్ మాత్రం తమ షరతులను అంగీకరించేందుకు ససేమిరా అందంటూ వాన్స్ అసహనం వ్యక్తం చేశారు.
అణుబాంబుపై టెన్షన్.. గుట్టు విప్పని వాన్స్
అసలు ఇరాన్ ఏయే షరతులను తిరస్కరించిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన అత్యంత వ్యూహాత్మకంగా బదులిచ్చారు. 21 గంటల పాటు అత్యంత గోప్యంగా జరిగిన చర్చల రహస్యాలను ఇప్పుడు పబ్లిక్గా చర్చించి, వీధిన పడేయదలుచుకోలేదని ఆయన కరాఖండీగా స్పష్టం చేశారు.
అయితే, ఈ చర్చల్లో అమెరికా ప్రధాన లక్ష్యం ఒక్కటేనని తేల్చి చెప్పారు. ఇరాన్ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయబోమని, ఆ భయంకరమైన ప్రయత్నాలకు అవసరమైన సాధనాలను సైతం సమకూర్చుకోబోమని ఒక పక్కా, రాతపూర్వక హామీ (అఫిర్మేటివ్ కమిట్మెంట్) ఇవ్వాలని అమెరికా పట్టుబట్టింది. అమెరికా అధ్యక్షుడి అసలైన లక్ష్యం కూడా ఇదేనని వాన్స్ నొక్కి చెప్పారు.
గతంలో ఇరాన్కు ఉన్న అణు కార్యక్రమాలను, యురేనియం శుద్ధి కర్మాగారాలను ఇప్పటికే పూర్తిగా ధ్వంసం చేశామని ఆయన గుర్తు చేశారు. కానీ, కేవలం ఇప్పుడు లేదా ఒక రెండేళ్ల పాటు మాత్రమే కాదు.. దీర్ఘకాలంలో ఎప్పటికీ అణ్వాయుధాల జోలికి వెళ్లబోమన్న బలమైన నిబద్ధత ఇరాన్ వైపు నుంచి కనిపించడం లేదని వాన్స్ విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆ హామీ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఫ్రీజ్ అయిన నిధులపై చర్చ.. వంగని టెహ్రాన్
ఇక ఫ్రీజ్ అయిన (స్తంభింపజేసిన) ఇరాన్ ఆస్తుల విడుదల అంశం చర్చకు వచ్చిందా అన్న ప్రశ్నకు వాన్స్ స్పందించారు. ఈ భేటీలో ఆస్తుల విషయంతో పాటు ఇంకా అనేక కీలక అంశాలపై లోతుగా చర్చించామని వెల్లడించారు.
నిజానికి అమెరికా ఈ చర్చల్లో ఎంతో నెమ్మదిగా, పరిస్థితులకు తగ్గట్లుగా సర్దుకుపోయే ధోరణిలోనే వ్యవహరించిందని వాన్స్ చెప్పుకొచ్చారు. "మీరు పూర్తి చిత్తశుద్ధితో అక్కడికి వెళ్లి, ఒప్పందం కుదుర్చుకోవడానికి మీ వంతు అత్యుత్తమ ప్రయత్నం చేయండి" అని సాక్షాత్తూ అధ్యక్షుడు ట్రంప్ తమకు సూచించారని వాన్స్ గుర్తు చేశారు. ట్రంప్ ఆదేశాల మేరకే తాము ఎంతో నిజాయితీగా ప్రయత్నించినా.. దురదృష్టవశాత్తూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆయన వాపోయారు.
ట్రంప్తో నిరంతర సంభాషణ.. ఫైనల్ ఆఫర్!
ఈ 21 గంటల ఉత్కంఠభరిత చర్చల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మీరు ఎన్నిసార్లు టచ్లో ఉన్నారని అడగ్గా.. కనీసం ఆరు నుంచి 12 సార్లు ట్రంప్తో మాట్లాడామని వాన్స్ సంచలన విషయం బయటపెట్టారు.
అంతేకాకుండా అడ్మిరల్ బ్రాడ్ కూపర్, యుద్ధ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, కోశాగార కార్యదర్శి స్కాట్ బెసెంట్.. ఇలా మొత్తం జాతీయ భద్రతా బృందంతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని వాన్స్ వివరించారు.
చివరిగా, తాము ఇక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఇరాన్ ముందు ఒక అత్యుత్తమ, 'ఫైనల్ ఆఫర్'ను ఉంచామని వెల్లడించారు. తాము ఇచ్చిన ఆ తుది ప్రతిపాదనను ఇరాన్ అంగీకరిస్తుందో లేదో వేచి చూడాల్సిందేనని జేడీ వాన్స్ ఒక భారీ సస్పెన్స్తో తమ దౌత్య పర్యటనకు ముగింపు పలికారు.
దౌత్య చర్చలు విఫలమవడం అంటే.. మరో భీకర యుద్ధానికి సైరన్ మోగడమే! అగ్రరాజ్యం తన చిట్టచివరి బ్రహ్మాస్త్రంగా ఇచ్చిన 'ఫైనల్ ఆఫర్'ను ఇరాన్ గనక తిరస్కరిస్తే, పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంగా మారడం ఖాయం. ఆ మంటల సెగ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మనలాంటి సామాన్యుడి జేబును దహించివేయకముందే ఏదో ఒక అద్భుతం జరగాలని ఆశిద్దాం!

