భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం క్రమంగా మందగిస్తోంది. ఫలితంగా, భవిష్యత్తులో రోజుకు 24 గంటలకు బదులు 25 గంటలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జర్మనీలోని మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సిటీ, అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విషయాన్ని తమ అధ్యయనంలో వెల్లడించారు.
ఈ మార్పు ఎందుకు?
భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడు ప్రతీ సంవత్సరం సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున మన గ్రహం నుంచి దూరంగా జరుగుతున్నాడు. ఈ దూరం పెరిగే కొద్దీ భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న గురుత్వాకర్షణ బలాల్లో మార్పులు వస్తున్నాయి. చంద్రుడి ప్రభావంతో సముద్రాల్లో ఏర్పడే ఆటుపోట్ల తీరు కూడా మారుతోంది. వాతావరణ పరిస్థితులు కూడా దీనికి తోడై భూభ్రమణ వేగం తగ్గుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలో దాదాపు 20 అడుగుల లోతులో అమర్చిన ప్రత్యేకమైన రింగ్ లేజర్ టెక్నాలజీ సహాయంతో ఈ మార్పులను గుర్తించారు.
ఇది మొదటిసారి కాదు!
భూభ్రమణ వేగంలో మార్పులు రావడం, రోజులోని గంటల వ్యవధి మారడం ఇదేమీ మొదటిసారి కాదని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. సుమారు 140 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు, భూమి వేగంగా తిరగడం వల్ల రోజుకు కేవలం 18 గంటలు మాత్రమే ఉండేవట. కాలక్రమేణా చంద్రుడు దూరమవుతున్న కొద్దీ, భూభ్రమణ వేగం తగ్గి, రోజు నిడివి పెరుగుతూ వస్తోంది.
ఎప్పుడు జరుగుతుంది?
రోజుకు 25 గంటలు అయ్యే మార్పు తక్షణమే జరగదు. ఈ మార్పు రావడానికి సుమారు 20 కోట్ల సంవత్సరాలు పట్టొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అప్పటికి మానవ నాగరికత ఉన్నట్లయితే, క్యాలెండర్లలో తేదీల లెక్కింపు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) లోని అటామిక్ క్లాక్లు, విమానయాన సమయపాలన వంటి అనేక వ్యవస్థలలో కీలకమైన సర్దుబాట్లు చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.