బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మహేశ్ కుమార్ గౌడ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.
కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపైనా, బీఆర్ఎస్ నేతలపైనా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.
బేషరతు క్షమాపణకు డిమాండ్
అసత్య ఆరోపణలపై మహేశ్ కుమార్ గౌడ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా, అక్రమంగా పెట్టిన కేసుల విచారణకు కూడా హాజరై సహకరించామని ఆయన గుర్తుచేశారు.
బీఆర్ఎస్ హెచ్చరిక
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పూర్తిగా గాలికొదిలేసి ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చూస్తూ ఊరుకోబోవని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్ అన్నారు.
రాజకీయ దురుద్దేశంపై విమర్శలు
స్థానిక ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందని, కానీ ఇలాంటి కేసులతో ఒరిగేదేమీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అబద్ధాలు చెప్పడంలో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేసే వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ గౌడ్ లాంటివారిని కోర్టులకు ఈడుస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
ఇప్పుడైనా అటెన్షన్ డైవర్షన్ డ్రామాలను పక్కన పెట్టి, పరిపాలనపై దృష్టి పెట్టి, ప్రజలకు మంచి చేసే అంశాలపై దృష్టి సారించాలని కేటీఆర్ హితవు పలికారు.

