పోలీస్ స్టేషన్‌లోనే బాంబు ఎలా పేలింది? | Nowgam police station

naveen
By -

 ఉగ్రవాదుల కుట్రను ఛేదించారు.. కానీ ఆ కుట్రకు వాడాల్సిన బాంబులే వారిని బలితీసుకున్నాయి!


Srinagar police station blast investigation.


జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఊహించని ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాలే, అవే అధికారుల పాలిట మృత్యుపాశంగా మారాయి. శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.


సాక్ష్యాలను పరిశీలిస్తుండగా పేలుడు!

ఇటీవల ఓ ఉగ్రవాద ముఠా నుంచి పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం సాయంతో ఆ పదార్థాలను పరిశీలిస్తుండగా, అవి అకస్మాత్తుగా పేలిపోయాయి. ఈ పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ ప్రాంగణం దద్దరిల్లింది.


ఈ ఘోర ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు, నయీబ్ తహసీల్దార్ సహా ఇద్దరు రెవెన్యూ అధికారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఏడుగురు మృతి చెందగా, మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.


ఐదుగురి పరిస్థితి విషమం

గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి, షేర్-ఏ-కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్కిమ్స్)కు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


"వైట్ కాలర్" టెర్రర్ లింక్

ఈ విషాదం వెనుక మరో భయంకరమైన కోణం ఉంది. ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పోస్టర్ల కేసును దర్యాప్తు చేస్తూ, ఉన్నత విద్యావంతులు, డాక్టర్లతో నడుస్తున్న "వైట్ కాలర్ ఉగ్రవాద నెట్‌వర్క్" గుట్టురట్టింది ఇదే నౌగామ్ పోలీస్ స్టేషన్.

ఇటీవల ఢిల్లీలో 13 మందిని బలిగొన్న కారు బాంబు పేలుడుకు కూడా ఇదే ముఠా కారణమని దర్యాప్తులో తేలింది.


ఆ "వైట్ కాలర్" ముఠా నుంచే పోలీసులు ఈ భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కుట్రను విజయవంతంగా ఛేదించిన అధికారులే, చివరకు వారు వాడాల్సిన బాంబులకే బలికావడం శ్రీనగర్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.