2026లో ప్రపంచం తలకిందులు కాబోతోంది.. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత ఇచ్చిన వార్నింగ్ వింటే వెన్నులో వణుకు పుడుతుంది! మీ ఉద్యోగం, ఆస్తులు సేఫ్ కాదు, ఇప్పటి నుంచే సిద్ధం కాకపోతే కష్టమే.
ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్ పుస్తక రచయితగా, ఆర్థిక నిపుణుడిగా గుర్తింపు పొందిన రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై బాంబు పేల్చారు. 2026 నుంచి చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యం (Recession) ప్రారంభం కాబోతోందని, దానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా గట్టిగా హెచ్చరించారు.
ఉద్యోగాలు ఊడతాయి.. మహా మాంద్యం వస్తోంది!
అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే రాబోయే ముప్పుకు సంకేతాలని ఆయన విశ్లేషించారు. నవంబర్ నెలలోనే అమెరికాలో దాదాపు 32,000 ఉద్యోగాలు పోయాయని, చిన్న వ్యాపారాలు ఏకంగా 1.20 లక్షల మందిని ఇంటికి పంపించాయని గుర్తుచేశారు. 2026లో ఈ కోతలు మరింత భయంకరంగా ఉంటాయని, అందుకే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా బతుకుతారో, సామాన్యులు కూడా అలాగే జీవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.
కియోసాకి 'సర్వైవల్' ప్లాన్ ఇదే..
మాంద్యం నుంచి బయటపడటానికి, డబ్బు సంపాదించడానికి కియోసాకి కొన్ని ఆసక్తికరమైన, ఆచరణాత్మక సూచనలు చేశారు:
సైడ్ ఇన్కమ్: ఖాళీగా ఉండకుండా, సొంత కారు ఉంటే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి తక్షణమే అదనపు ఆదాయాన్ని సంపాదించండి.
పనికిరాని డిగ్రీలు వద్దు: అప్పులు చేసి కాలేజీలకు వెళ్లే బదులు.. నర్సింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, వృద్ధుల సంరక్షణ వంటి ఎప్పటికీ డిమాండ్ ఉండే ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోండి.
రియల్ ఎస్టేట్ క్రాష్: 2026లో ఇళ్లు, వాణిజ్య భవనాల ధరలు పూర్తిగా పడిపోతాయి. అప్పుడే 'లైఫ్టైమ్ డీల్స్' దొరుకుతాయి, పెట్టుబడిదారులు సిద్ధంగా ఉండాలి.
ప్రస్తుతం ఉన్న డాలర్ను ఆయన 'నకిలీ డబ్బు'గా కొట్టిపారేశారు. మీ సంపదను కాపాడుకోవాలంటే బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథేరియం వంటి నిజమైన ఆస్తుల్లోనే పెట్టుబడి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా వెండి ధర 2026 నాటికి ఔన్సుకు $57 నుంచి $96కు చేరుకుంటుందని జోస్యం చెప్పారు.

