బ్యాంకు ఉద్యోగులకు చేదు వార్త! విలీనం పేరుతో వేలాది మందిని ఇంటికి పంపేందుకు ఆ దిగ్గజ బ్యాంక్ సిద్ధమైంది. ఆ సంఖ్య వింటేనే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
ప్రముఖ స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ (UBS) సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తన ప్రత్యర్థి బ్యాంక్ క్రెడిట్ సూయిజ్ను విలీనం చేసుకున్న తర్వాత, ఖర్చులు తగ్గించుకునే క్రమంలో భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు ప్లాన్ చేస్తోంది. 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 ఉద్యోగాలను తొలగించాలని యోచిస్తున్నట్లు స్విట్జర్లాండ్కు చెందిన 'సాన్ట్యాగ్స్బ్లిక్' పత్రిక బాంబు పేల్చింది.
9 శాతం మందికి ఉద్వాసన?
ప్రస్తుత గణాంకాల ప్రకారం 2024 చివరి నాటికి యూబీఎస్లో 1.10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు ప్రతిపాదించిన కోతలు అమలైతే, మొత్తం సిబ్బందిలో దాదాపు 9 శాతం మంది తమ ఉద్యోగాలను కోల్పోతారు. అయితే, బలవంతంగా ఉద్యోగులను తొలగించకుండా ఉండేందుకు బ్యాంక్ కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తోంది:
సహజ నిష్క్రమణ: ఉద్యోగం మానేసి వెళ్ళేవారి స్థానాలను భర్తీ చేయకపోవడం.
ముందస్తు రిటైర్మెంట్: సీనియర్లకు ఎర్లీ రిటైర్మెంట్ ఆప్షన్ ఇవ్వడం.
అంతర్గత బదిలీలు: ఇతర విభాగాలకు ఉద్యోగులను మార్చడం.
ఇప్పటికే 15 వేల మంది ఇంటికి..
2023లో క్రెడిట్ సూయిజ్ను టేకోవర్ చేసినప్పటి నుంచి యూబీఎస్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. విలీనం సమయంలో (2023) 1.19 లక్షలుగా ఉన్న సిబ్బంది సంఖ్య, 2025 సెప్టెంబర్ నాటికి 1.04 లక్షలకు పడిపోయింది. అంటే ఇప్పటికే 15,000 ఉద్యోగాలు ఆవిరయ్యాయి. ఇప్పుడు రెండో దశలో మరో 10 వేల మందిపై వేటు పడనుంది. 167 ఏళ్ల చరిత్ర కలిగిన క్రెడిట్ సూయిజ్ శకం ముగిసినా, దాని ప్రభావం ఇంకా ఉద్యోగులను వెంటాడుతూనే ఉంది.

