Bihar Girls Suicide: మందలింపుతో నలుగురు బాలికల ఆత్మహత్య

naveen
By -
Bihar Girls Suicide


క్షణికావేశం.. నిండు ప్రాణాలను బలిగొంది. 'ఎందుకు అబ్బాయిలతో మాట్లాడుతున్నారు?' అని తల్లిదండ్రులు మందలించడమే వాళ్లు చేసిన పాపం. ఆ చిన్న మాటను అవమానంగా భావించి, సామూహికంగా విషం తాగి నలుగురు బాలికలు ప్రాణాలు తీసుకున్నారు. గుండెలు పిండేసే ఈ ఘటన బీహార్‌ (Bihar) లోని ఔరంగాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? సాక్ష్యాలు లేకుండా చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు ప్రయత్నించారు?


మందలింపు.. మనస్తాపం.. మరణం


జనవరి 29న ఔరంగాబాద్ జిల్లా హస్పూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దళితవాడలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులంతా 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులే. వీరు అబ్బాయిలతో మాట్లాడుతున్నారని గమనించిన కుటుంబసభ్యులు తీవ్రంగా మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐదుగురు బాలికలు, ఊరి పొలాల్లోకి వెళ్లి సామూహికంగా విషం తాగారు. దురదృష్టవశాత్తు వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక బాలిక ప్రాణాలతో బయటపడింది.


గుట్టుచప్పుడు కాకుండా దహన సంస్కారాలు


ఈ ఘటనలో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. పిల్లలు చనిపోయిన విషయం పోలీసులకు తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాలకు దహన సంస్కారాలు (Cremation) పూర్తి చేశారు. అనంతరం గ్రామం విడిచి పారిపోయారు. దీంతో పోలీసులకు పోస్టుమార్టం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది.


ఆ ఒక్క అమ్మాయి వల్లే నిజం తెలిసింది..


ఈ ఘటనపై స్థానిక మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు ఫిబ్రవరి 9న (నిన్న) సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాణాలతో బయటపడిన ఐదో బాలిక ఇచ్చిన వాంగ్మూలమే ఇప్పుడు పోలీసులకు కీలక ఆధారం. "అబ్బాయిలతో మాట్లాడినందుకు ఇంట్లో తిట్టారు.. అందుకే అందరం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నాం" అని ఆమె పోలీసులకు తెలిపింది.


పరారీలో కుటుంబాలు.. పోలీసుల గాలింపు


ప్రస్తుతం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామస్థులు దర్యాప్తునకు సహకరించడం లేదని ఎస్పీ అంబరీష్ రాహుల్ తెలిపారు. పరారీలో ఉన్న కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నామని, అసలు ఆ పిల్లలకు విషం ఎవరు ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్డీపీవో అశోక్ కుమార్ దాస్ వివరించారు.


పెంపకం అంటే భయం కాదు.. బాధ్యత! 

పిల్లలతో మాట్లాడండి.. వారిని వినండి. చిన్న చిన్న తప్పులకు కఠినంగా మందలించడం వల్ల లేత మనసులు గాయపడతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!