Social Media Age Limit India: చిన్న పిల్లలకు ఇక నో ఇన్స్టా, యూట్యూబ్? కేంద్రం సంచలన నిర్ణయం దిశగా!
మీ పిల్లలు ఫోన్ వదలట్లేదా? అన్నం తినాలన్నా, నిద్రపోవాలన్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందేనా? అయితే తల్లిదండ్రులకు ఒక గుడ్ న్యూస్, పిల్లలకు బ్యాడ్ న్యూస్. డిజిటల్ వ్యసనంతో చిత్తవుతున్న చిన్నారి లోకాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 'డిజిటల్ పేరెంట్' అవతారం ఎత్తబోతోంది. ఆస్ట్రేలియా తరహాలో మన దేశంలోనూ సోషల్ మీడియా వినియోగంపై వయో పరిమితి (Social Media Age Limit India) విధించే దిశగా అడుగులు వేస్తోంది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే హెచ్చరికలతో మోదీ సర్కార్ ఈ కఠిన నిర్ణయం తీసుకోబోతోందా?
ఆస్ట్రేలియా రూల్ మనకూ వస్తోందా?
పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న సోషల్ మీడియాపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రం భావిస్తోంది. ఢిల్లీలో జరిగిన ఐసీఏఎన్ఎన్ (ICANN) సదస్సులో కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే పిల్లల కోసం ప్రత్యేక వయో నిబంధనలను అమలు చేస్తున్నాయి. అదే తరహాలో భారత్లోనూ వయసు ధ్రువీకరణను (Age Verification) తప్పనిసరి చేసే బాధ్యతను సోషల్ మీడియా సంస్థలకే అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉంది. అంటే ఇకపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడాలంటే వయసు ప్రూఫ్ చూపించాల్సి రావొచ్చు.
గేమింగ్ వ్యసనం.. ఘజియాబాద్ ఘటనలే సాక్ష్యం
ఆన్లైన్ గేమింగ్ వ్యసనం, సోషల్ మీడియాలోని హానికరమైన కంటెంట్ పిల్లల మెదడుపై ఎంతటి దుష్ప్రభావం చూపిస్తోందో ఇటీవలి 'ఘజియాబాద్ ఘటన'లే నిదర్శనమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆర్థిక సర్వే (Economic Survey) చేసిన సూచనలను ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిశీలిస్తోంది. చీఫ్ ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని తేల్చిచెప్పారు.
రాష్ట్రాలు కూడా రెడీ.. ఏపీ, గోవా ప్లాన్ ఇదే
కేంద్రమే కాదు, రాష్ట్రాలు కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గోవా ప్రభుత్వాలు సొంతంగా వయసు నిబంధనలు తీసుకురావాలని ఆలోచిస్తున్నాయి. మరోవైపు, పిల్లలకు ఆన్లైన్ క్లాసుల పేరుతో స్క్రీన్ టైమ్ పెంచకుండా, సులువైన విద్యా పరికరాలను అందించాలని ఆర్థిక సర్వే సిఫార్సు చేసింది.
డిజిటల్ డిటాక్స్ తప్పనిసరి!
ఇది ఆంక్ష కాదు.. రక్షణ. భావి భారత పౌరులు ఫోన్లలో బందీలు కాకూడదంటే.. ఇలాంటి 'లక్ష్మణ రేఖ'లు తప్పనిసరి. తల్లిదండ్రుల బాధ్యతకు, ప్రభుత్వ చట్టం తోడైతేనే పిల్లల భవిష్యత్తు సేఫ్ గా ఉంటుంది.

