England vs Nepal T20 World Cup: వణికిన ఇంగ్లండ్.. నేపాల్ పోరాటానికి సలామ్! కేవలం 4 పరుగుల తేడాతో..
వాంఖడే స్టేడియం నిశ్శబ్ధమైపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కు చెమటలు పట్టాయి. పసికూన నేపాల్ (Nepal) సృష్టించిన సునామీ అలాంటిది మరి. టీ20 ప్రపంచకప్లో పెను సంచలనం తృటిలో తప్పిపోయింది. చారిత్రక విజయం అంచున నిలిచి.. ఆఖరి బంతి వరకు పోరాడి కేవలం 4 పరుగుల తేడాతో నేపాల్ ఓడిపోయింది. గెలిచింది ఇంగ్లండే అయినా.. గుండెలు గెలుచుకుంది మాత్రం నేపాల్ కుర్రాళ్లే. అసలు మ్యాచ్ ఎక్కడ మలుపు తిరిగింది? లోకేశ్ బామ్ మెరుపులు ఇంగ్లండ్ను ఎలా భయపెట్టాయి?
నేపాల్ వీరవిహారం.. గుండెలు చేతపట్టుకున్న ఇంగ్లండ్
185 పరుగుల భారీ లక్ష్యం అంటే చిన్న విషయం కాదు. కానీ నేపాల్ ఏమాత్రం బెదరలేదు. ఓపెనర్ కుశాల్ భుర్టెల్ (29) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39), దీపేంద్ర సింగ్ ఐరీ (44) ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ ఆడుతున్నంత సేపు ఇంగ్లండ్ కు ఓటమి భయం పట్టుకుంది. ప్రతి బంతికీ ఉత్కంఠ పెరిగిపోయింది.
లోకేశ్ బామ్ విధ్వంసం.. ఆఖరి ఓవర్ డ్రామా!
మ్యాచ్ అయిపోయిందని అనుకుంటున్న సమయంలో.. లోకేశ్ బామ్ (39 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో విరుచుకుపడి ఇంగ్లండ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. చివరి ఓవర్లో డ్రామా తారాస్థాయికి చేరింది. అయితే అనుభవజ్ఞుడైన శామ్ కరన్ (Sam Curran) పకడ్బందీగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ పరువు కాపాడాడు. నేపాల్ 180/6 వద్ద ఆగిపోయి, తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.
బ్రూక్, బెథెల్ ఇన్నింగ్స్ వల్లే..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసింది. జాకబ్ బెథెల్ (55), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (53) అర్ధశతకాలతో ఆదుకున్నారు. చివర్లో విల్ జాక్స్ (39) సిక్సర్ల మోత మోగించాడు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు.
ఓడినా గెలిచినట్లే!
క్రికెట్ అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. పోరాటం కూడా. పటిష్టమైన ఇంగ్లండ్ను వణికించిన నేపాల్ ప్రదర్శన.. ప్రపంచ క్రికెట్కు ఒక హెచ్చరిక.

