'బిగ్ బాస్ ఈజ్ వాచింగ్ యు' అన్నట్లు.. ఇకపై మన వ్యక్తిగత జీవితంపై కూడా ఆదాయపు పన్ను శాఖ (Income Tax Dept) కన్నేయబోతోందా? ఏప్రిల్ 1, 2026 నుంచి రాబోయే కొత్త ఆదాయపు పన్ను చట్టం ద్వారా ఐటీ అధికారులకు 'సూపర్ పవర్స్' (Super Powers) వస్తున్నాయా? మీ వాట్సాప్ చాటింగ్, ఫేస్బుక్ పోస్టులు, పర్సనల్ ఈమెయిల్స్ అన్నీ ఇకపై ఓపెన్ సీక్రెట్ అయిపోతాయా? గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి ఇండస్ట్రీ వర్గాల వరకు అందరినీ టెన్షన్ పెడుతున్న అంశం ఇదే. కొత్తగా వస్తున్న 'సెక్షన్ 247' పేరు వింటేనే జనం ఉలిక్కిపడుతున్నారు. ఈ గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టింది. అసలు ఆ 'సూపర్ పవర్స్' నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?
అసలు భయం ఎందుకు?
కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లో 'సెక్షన్ 247' అనే కొత్త నిబంధనను చేర్చారు. దీని ప్రకారం ఐటీ అధికారులకు పన్ను చెల్లింపుదారుల డిజిటల్ స్పేస్ (సోషల్ మీడియా, ఈమెయిల్స్)ను ఎలాంటి ఆంక్షలు లేకుండా యాక్సెస్ చేసే అపరిమిత అధికారాలు (Unlimited Powers) కట్టబెట్టారని పుకార్లు షికారు చేశాయి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందనే ఆందోళన ట్యాక్స్ పేయర్లలో మొదలైంది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది అమలవుతుందని ప్రచారం జరిగింది.
పార్లమెంట్లో కేంద్రం క్లారిటీ
ఈ ఆందోళనలపై లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ (Pankaj Chaudhary) స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఐటీ అధికారులకు సూపర్ పవర్స్ కల్పించారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు. సెక్షన్ 247 ద్వారా ట్యాక్స్ పేయర్ల డిజిటల్ ఖాతాలను ఇష్టారీతిన తనిఖీ చేసే అధికారం ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
అసలు ఈ 'సెక్షన్ 247' ఏంటి?
పాత దానికి కొత్త రూపం: 1961 చట్టంలోని 'సెక్షన్ 132' (సోదాలు, జప్తులకు సంబంధించినది) స్థానంలోనే ఈ కొత్త 'సెక్షన్ 247' వస్తోంది.
డిజిటల్ తాళం చెవి: ఐటీ దాడులు (Raids) జరిగినప్పుడు, కంప్యూటర్లు లేదా డిజిటల్ పరికరాల పాస్వర్డ్లను ఓవర్రైడ్ (Override) చేసి డేటాను పరిశీలించే అధికారం అధికారులకు ఎప్పటి నుంచో ఉంది.
టెక్నాలజీ అప్డేట్: ఇప్పుడు సాంకేతికత పెరిగినందున, డిజిటల్ సాక్ష్యాలను సేకరించేందుకు చట్టాన్ని కాస్త మాдерనైజ్ చేశారు తప్ప.. సామాన్యుల సోషల్ మీడియా ఖాతాల్లోకి చొరబడే పవర్స్ ఇవ్వలేదు.
No AI: ఈ సెక్షన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తావన లేదని మంత్రి స్పష్టం చేశారు.
మీ ప్రైవసీ సేఫ్.. కానీ దొంగలు జాగ్రత్త!
ప్రభుత్వం మీ వాట్సాప్ మెసేజ్లు చదవడానికి ఆసక్తిగా లేదు. కానీ పన్ను ఎగ్గొట్టి, ఆ డబ్బుతో జల్సాలు చేస్తూ సోషల్ మీడియాలో దొరికిపోతే మాత్రం.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దాడులు జరిగినప్పుడు మాత్రమే డిజిటల్ తాళాలు పగులుతాయి తప్ప.. సామాన్యుడి ప్రైవసీకి డోకా లేదు!

