ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ప్రతి భారతీయ విద్యార్థి కళ్లలోనూ ఒక కల ఉంటుంది. కానీ ఆ కలలు కన్నీళ్లుగా మారడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. తాజాగా కాలిఫోర్నియా బర్కలే యూనివర్సిటీలో (UC Berkeley) చదువుతున్న 22 ఏళ్ల భారతీయ ఆణిముత్యం సాకేత్ శ్రీనివాసయ్య (Saketh Srinivas) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందరినీ కలిచివేసింది.
ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి, హైపర్లూప్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేసిన మేధావి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడానికి కారణం ఏంటి? సాకేత్ మరణం తర్వాత ఆయన రూమ్మేట్ బనీత్ సింగ్ (Baneet Singh) బయటపెట్టిన సంచలన విషయాలు వింటే గుండె బరువెక్కుతుంది. ఆఖరి 15 రోజుల్లో సాకేత్ ప్రవర్తనలో వచ్చిన వింత మార్పులే ఇప్పుడు ఈ మిస్టరీకి సమాధానం చెబుతున్నాయి.
కర్ణాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య సామాన్య విద్యార్థి కాదు, అద్భుతమైన ప్రతిభావంతుడు. ఐఐటీ మద్రాస్ నుంచి వచ్చిన సాకేత్, భవిష్యత్ రవాణా వ్యవస్థగా భావిస్తున్న హైపర్లూప్ టెక్నాలజీలో 'మైక్రోచానల్ కూలింగ్ సిస్టమ్' కనిపెట్టిన ఆరుగురు మేధావుల బృందంలో ఒకరు. ఆవిష్కర్తగా పేటెంట్ హక్కులు కూడా పొందిన ఈ యువ ఇంజనీర్, బర్కలేలో బయో మాలిక్యులర్ ఇంజనీరింగ్ చేస్తూ ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కన్నాడు. కానీ విధి వేరేలా తలచింది.
ఆరు రోజుల గాలింపు తర్వాత ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున 'లేక్ అంజా' (Lake Anza) సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. అయితే ఇది ఆత్మహత్యే అని భావిస్తున్న అతని స్నేహితుడు, రూమ్మేట్ బనీత్ సింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాకేత్ మరణానికి రెండు వారాల ముందు నుంచే అతనిలో విపరీతమైన మార్పులు వచ్చాయని బనీత్ వివరించాడు.
గత 15 రోజులుగా సాకేత్ సరిగా నిద్రపోవడం లేదని, ఆహారం కూడా మానేసి కేవలం చిప్స్, కుకీస్ తింటూ గడిపాడని బనీత్ ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఒకరోజు క్లాసు నుంచి ఎర్రటి బాత్రోబ్ వేసుకుని వచ్చిన సాకేత్, "నాకిక దేని మీద ఆసక్తి లేదు. ప్రపంచం నా గురించి ఏమనుకున్నా నాకు అనవసరం" అని అన్నాడట. అప్పట్లో తాను దానిని ఒక జోక్ గానే తీసుకున్నానని, కానీ సాకేత్ ఎంతటి మానసిక సంఘర్షణలో ఉన్నాడో గుర్తించలేకపోయానని బనీత్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
జనవరి 21న తనను 'లేక్ అంజా'కు రావాలని సాకేత్ ఆహ్వానించాడని, కానీ తాను బద్ధకించి వెళ్లలేదని, అదే చోట సాకేత్ ప్రాణాలు తీసుకుంటాడని ఊహించలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ రోజు తాను వెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమోనన్న బాధ ఆ స్నేహితుడిని వెంటాడుతోంది.
ఫిబ్రవరి 9న సాకేత్ అదృశ్యం కాగా, క్యాంపస్కు కిలోమీటరు దూరంలో అతని బ్యాగ్, పాస్పోర్ట్, ల్యాప్టాప్ లభించాయి. కాలిఫోర్నియా పోలీసులు, భారత రాయబార కార్యాలయం సమన్వయంతో గాలింపు చేపట్టినా ఫలితం విషాదంగానే ముగిసింది.
సాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ సాకేత్ కుటుంబానికి అండగా నిలుస్తూ, మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎంతటి మేధావి అయినా మానసిక ఒత్తిడికి లోనైతే పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో సాకేత్ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
మేధస్సు గెలిచింది.. మనస్సు ఓడింది!
ర్యాంకులు, పేటెంట్లు జీవితాన్ని ఇవ్వలేవు. తోటి వారి ప్రవర్తనలో చిన్న మార్పు వచ్చినా గమనించి అండగా నిలవాల్సిన అవసరాన్ని సాకేత్ మరణం హెచ్చరిస్తోంది.

