బస్సు ప్రయాణం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు లేదా కమర్షియల్ యాడ్స్. కానీ, మనం రోజూ చూసే ఆర్టీసీ బస్సులపై మన వరంగల్ తివాచీలు, పోచంపల్లి ఇక్కత్ కళలు కనువిందు చేస్తే ఎలా ఉంటుంది?
అది కేవలం కంటికి ఇంపు మాత్రమే కాదు, ఆ కళలనే నమ్ముకుని బతుకుతున్న వేలాది మంది స్థానిక కళాకారుల జీవితాలకు ఒక ఉచిత పబ్లిసిటీ. అందుకే తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే తొలిసారిగా 'జీఐ ఆన్ వీల్స్' (GI on Wheels) అనే అద్భుత ప్రయోగానికి నేడు శ్రీకారం చుట్టింది. అసలు ఏయే బస్సులపై ఈ డిజైన్లు వేస్తున్నారు? దీనివల్ల సామాన్యుడికి, పర్యాటకానికి జరిగే మేలు ఏంటి?
బస్సులపై మన సంస్కృతి.. దేశంలోనే తొలిసారి!
తెలంగాణ రాష్ట్రంలోని భౌగోళిక గుర్తింపు (GI Tag) పొందిన ఆరు అరుదైన కళాకృతులను ఆర్టీసీ బస్సులపై ముద్రించారు. ఈ వినూత్న 'జీఐ ఆన్ వీల్స్' కార్యక్రమాన్ని ఇవాళ (ఫిబ్రవరి 27న) హైదరాబాద్ ఎంజీబీఎస్లో అట్టహాసంగా ప్రారంభించారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులతో ఈ డిజైన్లను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఆరు కళలు.. ఆరు ఎక్స్ప్రెస్ బస్సులు
తొలిదశలో భాగంగా ఈ ప్రత్యేక స్టిక్కర్లను ఆరు జిల్లాలకు చెందిన ఆరు ఎక్స్ప్రెస్ బస్సులపై ముద్రించారు. పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట చీరలు, నిర్మల్ పెయింటింగ్, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్, వరంగల్ తివాచీలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళలు ఇందులో ఉన్నాయి.
ఆయా ప్రాంతాల ప్రత్యేకతను చాటేలా, ఈ బస్సులను హైదరాబాద్ నుంచి వయా హనుమకొండ, పోచంపల్లి, నారాయణపేట, కరీంనగర్, నిర్మల్ కు నడుపుతారు. ఇది చూసే ప్రయాణికులకు మన వారసత్వంపై ఆసక్తి పెరుగుతుంది.
పర్యాటకానికి పెద్దపీట.. కళాకారులకు ఊరట
పోచంపల్లి ఇక్కత్ కు 2004లో, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి 2007లో జీఐ ట్యాగ్ దక్కింది. అలాగే 400 ఏళ్ల చరిత్ర ఉన్న నిర్మల్ పెయింటింగ్స్, సిద్దిపేట జిల్లా చేర్యాల కళలు ఎన్నో కుటుంబాలకు జీవనాధారం.
ఈ కళలను ఆర్టీసీ బస్సులపై ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. స్థానిక కళలకు డిమాండ్ పెరిగి, వాటినే నమ్ముకున్న నేతన్నలకు, హస్తకళాకారులకు ఆర్థికంగా ఎంతో అండ దొరుకుతుంది.
బస్సులు ఇక మూవింగ్ మ్యూజియాలు!
కనుమరుగవుతున్న మన కళలకు ఇంతకంటే గొప్ప బ్రాండింగ్ ఇంకొకటి ఉండదు. ఊరూరా తిరిగే ఈ బస్సులు ఇకపై మూవింగ్ మ్యూజియాల్లా పనిచేస్తాయి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, భవిష్యత్తులో తెలంగాణలోని పల్లెల్లో తయారయ్యే హస్తకళల మార్కెట్ దశ తిరిగిపోవడం ఖాయం. స్థానిక కళాకారుల ఆదాయం పెరుగుతుంది, సామాన్యుడిలో తన ప్రాంతం పట్ల ఒక గొప్ప గర్వం కలుగుతుంది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు కచ్చితంగా ఆదర్శం!

