ఐపీఎల్ మహా సంగ్రామం మొదలైంది.. మైదానంలో సిక్సర్లు పడుతుంటే, కొందరి ఇళ్లలో మాత్రం అప్పుల చిచ్చులు రగులుతున్నాయి. మీ పక్కనే కూర్చుని ఫోన్లో మ్యాచ్ చూస్తున్న మీవాడు వినోదాన్ని ఆస్వాదిస్తున్నాడా, లేక బెట్టింగ్ ఉచ్చులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడా?
ఈ ప్రశ్న సామాన్యుడిని నిద్రపోనివ్వకుండా చేస్తోంది. ప్రాణాలు తీస్తున్న ఈ జూదం పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఏకంగా యుద్ధమే ప్రకటించారు. క్రికెట్ క్రీడను జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామంటూ బెట్టింగ్ ముఠాలకు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఆన్లైన్ యాప్లు పోయినా.. కొత్త అవతారమెత్తిన మోసం!
గతంలో పోలీసులు చేపట్టిన '#SayNoToBettingApps' ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం వందలాది బెట్టింగ్ యాప్లను దేశవ్యాప్తంగా నిషేధించడమే కాకుండా, కఠినమైన ఆన్లైన్ గేమింగ్ బిల్లును సైతం తీసుకొచ్చేలా చేసింది. కానీ, ఈ సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. యాప్లు పోతే ఏంటి అంటూ టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల వేదికగా సరికొత్త వెబ్సైట్లను సృష్టించి మళ్లీ యువతను వలవేసి పట్టుకుంటున్నారు.
ఫామ్ హౌస్లపై స్పెషల్ ఫోకస్.. పీడీ యాక్ట్ ప్రయోగానికి సై!
ఈ బెట్టింగ్ మోసం కేవలం ఆన్లైన్కే పరిమితం కాలేదు. నగర శివార్లలోని ఫామ్ హౌస్లు, నివాస గృహాలు, రహస్య స్థావరాల్లో గుంపులు గుంపులుగా చేరి ఫోన్ల ద్వారా ఆఫ్లైన్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న వారిపై సైతం పోలీసులు ఇప్పుడు డేగకన్ను వేశారు. అమాయక యువతకు ఎరవేసి, వారిని అప్పుల ఊబిలోకి నెడుతున్న స్థానిక బుకీల భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించేది లేదని, అవసరమైతే వారిపై అత్యంత కఠినమైన 'పీడీ యాక్ట్' (PD Act) ప్రయోగించడానికైనా తాము వెనకాడబోమని సీపీ సజ్జనార్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
గెలిచేది నిర్వాహకులే.. బలిపశువులు మీరే!
కష్టపడకుండా అతి తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలనే అత్యాశ చివరికి కన్నీళ్లే మిగులుస్తుంది. ఈ బెట్టింగ్ మాయాజాలంలో అంతిమంగా గెలిచేది, కోట్లు గడించేది కేవలం ఆ దందా నడిపే నిర్వాహకులు మాత్రమే! ఆడే సామాన్యులు మాత్రం ఉన్నదంతా పోగొట్టుకుని నిలువునా బలైపోతారు. ఒక్కసారి ఈ రాక్షస వ్యసనానికి బానిసలైతే పచ్చని కుటుంబాలు సైతం అనాథలుగా రోడ్డున పడతాయి. క్రికెట్ అనేది ఒక అద్భుతమైన క్రీడ.. దాన్ని వినోదంగా మాత్రమే ఆస్వాదించాలి తప్ప, ప్రాణాలు తీసే జూదంగా మార్చుకోవద్దని పోలీసులు హితవు పలికారు.
బెట్టింగ్ భూతాన్ని తరిమేద్దాం.. సమాచారం ఇవ్వండిలా!
యువతను ఈ బెట్టింగ్ భూతం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉంది. మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు మీ దృష్టికి వచ్చినా, లేదా ఈ వ్యవహారంలో ఎవరైనా మిమ్మల్ని వేధింపులకు గురిచేస్తున్నా తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఏమాత్రం భయపడకుండా వెంటనే 'డయల్ 100' కు కాల్ చేయండి. లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555 కు మెసేజ్ ద్వారా వివరాలు పంపండి. మీ సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతారు.
బెట్టింగ్ యాప్లో కనపడే లాభం ఒక ఎండమావి లాంటిది. ఒక్క క్లిక్తో మీ జీవిత కష్టార్జితం పరులపాలవుతుంది. ఇది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. ఐపీఎల్ వేళ మీ పిల్లల, సన్నిహితుల ఆన్లైన్ కదలికలు, ఆర్థిక లావాదేవీలపై ఓ కన్నేసి ఉంచడమే సామాన్యుడిగా మీరు చేయగలిగే అతిపెద్ద రక్షణ చర్య. క్రికెట్ను ఎంజాయ్ చేయండి.. కానీ జీవితాన్ని పణంగా పెట్టకండి!
Also Read:
అక్రమ మైనింగ్పై హరీష్రావు ఫైర్.. పొంగులేటి రాజీనామాకు డిమాండ్!అడ్డుపడితే శివతాండవమే.. ప్రతిపక్షాలకు రేవంత్ మాస్ వార్నింగ్!
అమెరికాలో తెలుగు వాడి భారీ స్కామ్: నకిలీ CIA ఏజెంట్ అరెస్ట్!
తెలంగాణలో మండిపోతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు!
తెలంగాణ గోల్డ్ మ్యాన్కు ఐటీ షాక్.. కిలోల కొద్దీ బంగారం సీజ్!

