చట్టాన్ని రక్షించాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారితే? అవినీతి సామ్రాజ్యానికి రారాజుగా మారిన ఒక పోలీసు అధికారి కళ్లు చెదిరే బాగోతం ఇది. ఇంట్లో గిన్నెలు కడిగే పనిమనిషి ఏకంగా 35 లక్షల రూపాయల విలాసవంతమైన థార్ కారులో, అదీ అధికారిక పోలీసు వాహనంలో దర్జాగా డ్యూటీకి వస్తోందంటే ఆ అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోండి. సినిమాను మించిన మలుపులతో, కళ్లు బైర్లు కమ్మే అక్రమాస్తులతో బిహార్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ అవినీతి డీఎస్పీ డర్టీ పిక్చర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
పనిమనిషికి థార్ కారు..
కిషన్గంజ్లో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా (SDPO) పనిచేసిన డీఎస్పీ గౌతమ్ కుమార్ అవినీతి బాగోతం ఏ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకూ తీసిపోదు. ఏఎస్పీ ఇంద్ర ప్రకాశ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ఎకనమిక్ అఫెన్సివ్ వింగ్ (ఈఓయూ) బృందం.. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి సరిహద్దుల్లో ఉన్న కిషన్గంజ్కు వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు చేపట్టింది.
ఈ దాడుల్లో అధికారుల మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. డీఎస్పీ ఇంట్లో పనిచేసే పారో అలియాస్ పూజ అనే పనిమనిషి ఏకంగా రూ.35 లక్షల విలువైన 'థార్' వాహనంలో దర్జాగా డ్యూటీకి వచ్చేదని విచారణలో తేలింది. కొన్నిసార్లు సాక్షాత్తూ డీఎస్పీ అధికారిక వాహనంలోనూ ఆమె వచ్చి వెళ్లేదని తెలిసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు.
పనిమనిషితో ఎఫైర్.. కోటి రూపాయల బంగ్లా!
పనిమనిషి పారో లావిష్ లైఫ్స్టైల్ చూసి స్థానికులతో పాటు ఈఓయూ అధికారులు షాకయ్యారు. డీఎస్పీ సారు గారు తన పనిమనిషి పారో పేరిట పలు ప్లాట్లు కొనుగోలు చేయడమే కాకుండా, ఆమెకు ఒక బుల్లెట్ మోటారు సైకిల్ను సైతం కానుకగా ఇచ్చారని మీడియా రిపోర్ట్స్ ద్వారా బట్టబయలైంది.
అంతేకాదు, బెంగాల్లోని నార్త్ దినాజ్పూర్ సమీపంలో ఆమెకు ఏకంగా కోటి రూపాయల విలువైన ఖరీదైన బంగ్లా కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు డీఎస్పీకి ఆ పనిమనిషితో అక్రమ సంబంధం ఉందనే అనుమానాలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. డీఎస్పీ బాగోతం వెలుగులోకి రాగానే.. బెంగాల్లోని మాల్డా ప్రాంతానికి చెందిన ఆ కిలాడీ పారో వెంటనే అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయింది. ఈఓయూ అధికారులు దాడులు చేపట్టినప్పటికీ ఆమె ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు.
గర్ల్ ఫ్రెండ్, అత్తగారికి బంపర్ ఆఫర్లు!
అవినీతి సొమ్ముతో డీఎస్పీ గౌతమ్ కుమార్ తన భార్య రూబీ కశ్యప్, కుమారుడు సిద్ధార్థ గౌతమ్ పేరిటే కాకుండా.. తన గర్ల్ ఫ్రెండ్, అత్త పూనమ్ దేవి పేరిట కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆ గర్ల్ ఫ్రెండ్ ద్వారా డీఎస్పీకి ఒక బిడ్డ కూడా పుట్టినట్లు విచారణలో తేలింది.
ఆ ప్రియురాలికి ఆయన ఎంతగా ఫిదా అయ్యాడంటే.. ఆమె పేరిట ఏకంగా ఏడు ప్లాట్లు, ఒక భారీ ట్రక్కును కూడా కొనుగోలు చేశాడు. ఈఓయూ టీమ్ ఇప్పటి వరకూ జరిపిన లోతైన విచారణలో.. కుటుంబ సభ్యులు, ప్రియురాలి పేరిట కోట్లాది రూపాయల విలువైన మొత్తంగా 16 ప్లాట్లను ఆయన కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. ఆయనకు మొత్తంగా మూడు ఎస్యూవీ కార్లు ఉండగా.. అందులో ఒకటి అత్తగారి పేరిట రిజిస్టర్ అయి ఉండటం గమనార్హం.
రూ.80 కోట్ల అవినీతి.. ఎంట్రీ ఇవ్వనున్న ఈడీ!
1994లో ఇన్స్పెక్టర్గా బిహార్ పోలీసు విభాగంలో అడుగుపెట్టిన గౌతమ్ కుమార్.. అంచలంచెలుగా డీఎస్పీ స్థాయికి ఎదిగారు. తన 32 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఆయన అధికారిక ఆదాయం కంటే సుమారు 60 శాతం అదనంగా, అంటే ఏకంగా రూ.80 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారని అధికారులు అనుమానిస్తున్నారు. కేవలం బిహార్కే పరిమితం కాకుండా.. బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు దేశమైన నేపాల్లోనూ ఆయనకు కోట్లాది రూపాయల భారీ పెట్టుబడులు ఉన్నట్లు వెలుగుచూసింది.
ఈ సోదాల సమయంలో ఈఓయూ అధికారులు ఏకంగా 36 ల్యాండ్ డాక్యుమెంట్లు, ఖరీదైన ఆభరణాలు, లగ్జరీ వాచీలు, హై ఎండ్ వాహనాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కేసు నమోదు కావడంతో సదరు అవినీతి అధికారిని బిహార్ పోలీస్ శాఖ తక్షణమే సస్పెండ్ చేసింది. హద్దులు దాటిన ఈ మనీలాండరింగ్ వ్యవహారంపై త్వరలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసి రంగంలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చట్టాన్ని అమలు చేయాల్సిన చేతులే వందల కోట్ల అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిన ఈ డీఎస్పీ వ్యవహారం.. ఇప్పుడు యావత్ దేశ పోలీసు వ్యవస్థకే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది!
Also Read:
Amrit Bharat Express 3.0 : జనరల్ నుంచి ఏసీకి.. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 3.0 ప్రత్యేకతలు ఇవేAssam Elections: అస్సాం ఎన్నికల్లో భగ్గుమన్న 'బీఫ్' రాజకీయం
Annamalai: తమిళనాడు ఎన్నికల్లో పోటీపై అన్నామలై క్లారిటీ
ఆప్ కుట్రలపై రాఘవ్ చద్దా సంచలన కౌంటర్: వీడియో వైరల్
బెంగళూరులో ఇళ్ల ధరల మంట.. 2BHK రెండు కోట్లా?

