ఒకప్పుడు కారు కొనడం అంటే ఓ కల.. ఓ లగ్జరీ! కానీ ఇప్పుడు అది సామాన్యుడి కనీస అవసరం. రోడ్డెక్కితే చాలు, చీమల దండులా కార్లే దర్శనమిస్తున్నాయి. పెరిగిన ఆదాయం, తగ్గిన ధరలు, పండుగ ఆఫర్లు.. కారణం ఏదైనా దేశంలో కార్ల వినియోగం మునుపెన్నడూ లేని స్థాయిలో దూసుకుపోతోంది. సరిగ్గా ఇదే ఊపులో, మారుతీ సుజుకీ వదిలిన ఒక బ్రహ్మాస్త్రం ఇప్పుడు మిడ్ సైజ్ ఎస్యూవీ (SUV) మార్కెట్లో పెను సునామీ సృష్టిస్తోంది. దిగ్గజ కంపెనీలకు సైతం చెమటలు పట్టిస్తున్న ఆ మోడల్ మరేదో కాదు.. 'మారుతీ సుజుకీ విక్టోరిస్'. కేవలం ఏడు నెలల్లోనే ఈ కారు సృష్టించిన విధ్వంసం, సాధించిన రికార్డుల ముఖచిత్రం ఇప్పుడు ఆటోమొబైల్ రంగాన్నే ఆశ్చర్యపరుస్తోంది!
జిఎస్టీ తగ్గింపు.. కార్ల మార్కెట్కు బూస్ట్!
గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం దేశీయ ఆటోమొబైల్ రంగానికి ఒక సంజీవనిలా మారింది. చిన్న కార్లపై ఏకంగా జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి అమాంతం తగ్గించింది. అంతటితో ఆగకుండా, వాటిపై అదనంగా ఉండే సెస్సును సైతం పూర్తిగా తొలగించింది.
దీంతో చాలా వరకు కార్ల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. అన్ని దిగ్గజ కంపెనీలు కూడా తమపై తగ్గిన ఈ జీఎస్టీ రేట్ల భారాన్ని.. నేరుగా వినియోగదారులకు బదలాయించి ధరలు తగ్గించాయి. వీటికి తోడుగా అదనపు తగ్గింపు ఆఫర్లు ప్రకటించి, మార్కెట్లోకి పోటాపోటీగా కొత్త కొత్త మోడళ్లను దించడంతో.. గత ఆర్థిక సంవత్సరంలో కార్ల సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి.
ఎంట్రీతోనే ఎగరేసిన 'విక్టోరిస్' జెండా!
సరిగ్గా ఆ బూస్ట్ను క్యాష్ చేసుకుంటూ 2025, సెప్టెంబరులో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది మిడ్ సైజ్ ఎస్యూవీ మోడల్ 'మారుతీ సుజుకీ విక్టోరిస్'. లాంచ్ అయినప్పటి నుంచి కేవలం 7 నెలల అతి తక్కువ వ్యవధిలోనే, ఏకంగా 75,590 యూనిట్లను విక్రయించి ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది.
దీంతో భారత ప్యాసింజర్ వెహికిల్ సెగ్మెంట్లో.. ప్రారంభ దశలోనే ఇంతటి ఊహించని రెస్పాన్స్ సాధించిన అతికొద్ది మోడళ్ల జాబితాలో విక్టోరిస్ సగర్వంగా నిలిచింది.
ఏడు నెలలు.. 75 వేల కార్లు.. సేల్స్ సునామీ!
విక్టోరిస్ సేల్స్ పరుగు ఎలా ఉందో లెక్కల్లో చూస్తే మతిపోవాల్సిందే. గతేడాది సెప్టెంబరులో లాంఛింగ్ నెలలో 4,261 యూనిట్లు విక్రయమయ్యాయి. అది కాస్తా అక్టోబరు నాటికి ఊపందుకుని ఏకంగా 13,496 యూనిట్లకు చేరింది.
నవంబరులోనూ అదే ఊపు కొనసాగిస్తూ 12,300 యూనిట్లను విక్రయించింది. అయితే డిసెంబరులో కాస్త నెమ్మదించి విక్రయాలు 6,210 యూనిట్లకు పడిపోయాయి. కానీ, కొత్త సంవత్సరంలో మళ్లీ పుంజుకుని.. జనవరి నెలలో ఏకంగా 15,240 యూనిట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుబోయాయి. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 13,021 యూనిట్లుగా, మార్చిలో 11,062 యూనిట్లుగా నమోదైంది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తే సగటున నెలకు 10 వేలకుపైగానే యూనిట్లను విక్రయిస్తూ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది.
క్రెటా, సెల్టోస్లకు గట్టి పోటీ.. ధర ఎంతంటే?
మిడ్ సైజ్ SUV సెగ్మెంట్ని శాసిస్తున్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, టాటా సియరా, రెనాల్ట్ డస్టర్ వంటి ఉద్దండులకు ఈ మారుతీ విక్టోరిస్ ఇప్పుడు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ విక్టోరిస్ ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ. 10.50 లక్షలుగా ఉండగా.. టాప్ ఎండ్ గరిష్ఠ ధర రూ. 19.98 లక్షల వరకు ఉంది.
ఫీచర్లలో రారాజు.. భద్రతలో బహుబలి!
విక్టోరిస్ కేవలం లుక్స్తోనే కాదు, అత్యాధునిక ఫీచర్లతోనూ అదరగొడుతోంది. పెట్రోల్, హైబ్రిడ్, సీఎన్జీ (CNG) వేరియంట్లలో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. పార్కింగ్ను సులభతరం చేసే 360 డిగ్రీ కెమెరాతో పాటు, పనోరమిక్ సన్రూఫ్, డ్రైవర్కు అండగా ఉండే అడాస్ (ADAS) లాంటి టాప్ క్లాస్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అన్నింటికీ మించి భద్రతలో ఏకంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. 6 ఎయిర్ బ్యాగ్స్తో ప్రయాణికులకు అత్యున్నత భద్రతను అందిస్తోంది. ఇక సీఎన్జీ (CNG) వేరియంట్లో అండర్ బాడీ ట్యాంక్ ఇవ్వడం వల్ల.. గ్యాస్ కారులో కూడా ఎంతో విశాలమైన బూట్ స్పేస్ లభించడం దీని అతిపెద్ద ప్లస్ పాయింట్. లోపల వినోదం కోసం 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్స్ అప్ డిస్ప్లేలు ఈ కారు ఇంటీరియర్కు మరింత లగ్జరీ లుక్ను తీసుకొచ్చాయి.
మారుతీ అంటే మైలేజ్ మాత్రమే కాదు, ఫీచర్లు, భద్రత కూడా అని ఈ విక్టోరిస్ నిరూపించింది. మిడ్ సైజ్ ఎస్యూవీ కొనాలనుకునే సామాన్యుడికి 5 స్టార్ రేటింగ్, సీఎన్జీ ఆప్షన్, పనోరమిక్ సన్రూఫ్ అన్నీ ఒకే కారులో దొరకడం వల్లే 7 నెలల్లో 75 వేల బుకింగ్స్ సాధ్యమయ్యాయి. రాబోయే రోజుల్లో క్రెటా మార్కెట్కు ఇది నిజమైన కిల్లర్గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు!

