సొంతింటి కల.. సామాన్యుడి జీవితంలో అతిపెద్ద లక్ష్యం! పైసా పైసా కూడబెట్టి, కడుపు కట్టుకుని ఒక చిన్న ఇల్లు కొనుక్కుందామనే ఆశతో ఎదురుచూసేవారికి ఇది నిజంగా గుండె పగిలే వార్తే. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం, ఇక్కడ మన ఇండియాలో సామాన్యుడి సొంతింటి కలను నిలువునా దహించేస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న భీకర పోరు సృష్టిస్తున్న అస్థిరత.. ఇప్పుడు భారతీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక భయంకరమైన సుడిగుండంలోకి నెట్టేసింది. ఒకవైపు ఇళ్ల అమ్మకాలు దారుణంగా పడిపోతుంటే, మరోవైపు ఇళ్ల ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి!
కుప్పకూలిన అమ్మకాలు.. 18 క్వార్టర్లలో తొలిసారి!
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొంత కాలంగా భయపెట్టే మందగమనం కొనసాగుతోంది. ఈ క్యాలెండర్ ఇయర్ జనవరి- మార్చి సమయంలో పరిస్థితి అదుపుతప్పింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు కనీవినీ ఎరుగని రీతిలో దారుణంగా పడిపోయాయని ప్రముఖ సంస్థ 'ప్రాప్ఈక్విటీ' రిపోర్ట్ సంచలన విషయాలను స్పష్టం చేసింది.
ఈ రిపోర్ట్ ప్రకారం, జనవరి- మార్చి మాసాల్లో దేశంలోని 9 ప్రధాన నగరాల్లో హౌసింగ్ సేల్స్ రికార్డు స్థాయిలో కుప్పకూలాయి. గత 18 త్రైమాసికాల తర్వాత తొలిసారిగా ఒక క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు లక్ష యూనిట్ల లోపునకు పడిపోవడం రియల్ ఎస్టేట్ రంగాన్ని తీవ్ర ఉలిక్కిపాటుకు గురిచేసింది. మొత్తం విక్రయాలు దాదాపు 13 శాతం మేర పడిపోయాయి. ఒక్క ఢిల్లీ- ఎన్సీఆర్, బెంగళూరు నగరాల్లో మాత్రమే అమ్మకాలు స్వల్పంగా పెరిగాయని ఈ రిపోర్ట్ పేర్కొంది.
హైదరాబాద్ మార్కెట్ డల్.. సేల్స్ డౌన్!
గత కొన్నేళ్లుగా పరుగులు తీసిన మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు కూడా బ్రేకులు పడ్డాయి. ఐటీ కారిడార్లతో కళకళలాడే భాగ్యనగరంలో ఏకంగా హౌసింగ్ సేల్స్ 16 శాతం వరకు పడిపోవడం ఇక్కడి మార్కెట్ అస్థిరతకు అద్దం పడుతోంది. కొనుగోలుదారులు వెనకడుగు వేస్తుండటంతో రియల్టర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
కొనేవాళ్లు లేరు.. కానీ రేట్ల మంట ఆగట్లేదు!
అమ్మకాలు పడిపోతే రేట్లు తగ్గాలి కదా అన్నది సామాన్యుడి లెక్క. కానీ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ 'అనరాక్' తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ గుండెలు బద్దలయ్యే నిజాన్ని బయటపెట్టింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ జనవరి- మార్చి త్రైమాసికంలో ఇళ్ల ధరలు ఏమాత్రం తగ్గకపోగా, సగటున 2 శాతం మేర పెరిగాయని కుండబద్దలు కొట్టింది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణమే దీనికి అసలు కారణం. ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వినియోగదారుల సెంటిమెంట్ పూర్తిగా ప్రతికూలంగా మారడమే ఈ విపత్కర పరిస్థితికి దారితీసిందని అనరాక్ కుండబద్దలు కొట్టింది.
ధరల పెరుగుదల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. అక్టోబర్- డిసెంబరుతో పోల్చి చూస్తే చదరపు అడుగు సగటు ధర రూ. 9,260 నుంచి రూ. 9,456 కు పెరిగినట్లు రిపోర్ట్ పేర్కొంది. ఇక వార్షిక ప్రాతిపదికన చూస్తే, చదరపు అడుగు సగటు ధర రూ. 8,868 నుంచి ఏకంగా 7 శాతం మేర పైకి ఎగబాకిందని అనరాక్ వివరించింది. ఢిల్లీ- ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), బెంగళూరు, పుణె, హైదరాబాద్, కోల్కతా, చెన్నై మార్కెట్లను లోతుగా పరిశీలించి ఈ రిపోర్ట్ విడుదల చేశారు. త్రైమాసికం పరంగా చూస్తే ఈ 7 నగరాల్లో గృహ విక్రయాలు వాల్యూమ్ పరంగా 7 శాతం మేర తగ్గగా, విలువ పరంగా 6 శాతం పడిపోయాయి.
ఏ నగరంలో ఎంత పెరిగిందంటే?
హైదరాబాద్ మహానగరంలో 2025 అక్టోబర్- డిసెంబరు కాలంలో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున రూ. 7,830 గా ఉండేవి. కానీ అది ఇప్పుడు 2 శాతం మేర పెరిగి ఏకంగా రూ. 7,990 కి చేరినట్లు అనరాక్ వెల్లడించింది. ఇతర నగరాల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఢిల్లీ- ఎన్సీఆర్ లో ఈ ధర 3 శాతం మేర పెరిగి చదరపు అడుగుకు రూ. 9,620 కి చేరుకుంది.
మరోవైపు కోల్కతాలోనూ ఈ మంట తప్పలేదు. అక్కడ 3 శాతం మేర ఎగబాకి చదరపు అడుగు రూ. 6,120 నుంచి రూ. 6,290 కి చేరింది. ఐటీ హబ్లైన బెంగళూరు, పుణెల్లోనూ 2 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరగడంతో.. చదరపు అడుగు సగటున వరుసగా రూ. 9,310 మరియు రూ. 8,220 కి చేరింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై (ఎంఎంఆర్), చెన్నైల్లో వరుసగా ఒక్క శాతం చొప్పున పెరిగి చదరపు అడుగుకు ఇప్పుడు ముంబైలో రూ. 17,600 కు, చెన్నైలో రూ. 7,165 గా స్థిరపడ్డాయి.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. ఎక్కడో ఖండాంతరాల్లో పడే బాంబుల మోత, సామాన్యుడి సొంతింటి కలను పేకమేడలా కూల్చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు!
Also Read:
Petrol Diesel Prices: ఒకే దేశం.. పెట్రోల్ ధరల్లో రూ.20 తేడా! ఇదెక్కడి చోద్యం?మెటాలో ఏఐ మంటలు: కాలిఫోర్నియాలో మరో 200 మందిపై వేటు!
భారత ఆటోమొబైల్ రికార్డు: 47 లక్షల కార్ల సేల్స్, పతనమైన ధరలు!
మొబైల్స్, టీవీల ధరల మంట.. సామాన్యుడికి షాక్!
చైనా బ్యాటరీల దెబ్బకు వణుకుతున్న అమెరికా ఈవీ మార్కెట్!

