US F-15 Fighter Jet Shot Down In Iran Intensive Rescue Operation Underway : పశ్చిమాసియాలో కూలిపోయిన ఒకే ఒక్క అమెరికా యుద్ధ విమానం.. ఇరాన్ గడ్డపై అదృశ్యమైన ఆ అమెరికన్ సైనికుడు గనక శత్రువుల చేతికి చిక్కితే.. అగ్రరాజ్యం నేరుగా భూతల యుద్ధానికి దిగడం ఖాయం! అదే జరిగితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకి, మన దేశంలో పెట్రోల్, నిత్యావసరాల రేట్లు మండిపోవడం తథ్యం. అందుకే ఇరాన్ గగనతలంలో కూలిపోయిన అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానం చుట్టూ జరుగుతున్న ఈ ప్రాణాపాయ రెస్క్యూ ఆపరేషన్.. ఇప్పుడు యావత్ ప్రపంచ ఆర్థిక, భద్రతా వ్యవస్థల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
కూలిన ఎఫ్-15.. ఒకరు సేఫ్, మరొకరు మిస్సింగ్!
పశ్చిమాసియా ఘర్షణల్లో తమ అత్యంత శక్తిమంతమైన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని ఇరాన్ నేలకూల్చడంతో అమెరికా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో విమానం నుంచి దూకేసిన ఒక పైలట్ను అమెరికా రెస్క్యూ బృందం ప్రాణాలతో సురక్షితంగా రక్షించినట్లు తెలుస్తోంది.
ఈ అద్భుతమైన ఆపరేషన్ గురించి పెంటగాన్ ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. కానీ, అదే విమానంలో ఆయుధ వ్యవస్థలను పర్యవేక్షించే మరో కీలక అధికారి ఆచూకీ గల్లంతవడం ఇప్పుడు పెను కలకలం రేపుతోంది.
డేగ కళ్లతో అమెరికా గాలింపు.. బరిలో స్విస్ ఆర్మీ నైఫ్స్!
అదృశ్యమైన తమ సైనికుడిని వెతికి పట్టుకునేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. ఇరాన్ భూభాగంలో ఏకంగా బ్లాక్ హాక్ హెలికాప్టర్లతో, ప్రత్యేక నైపుణ్యం కలిగిన బృందాలతో శత్రువుల కళ్లుగప్పి మరీ గాలింపు చర్యలు చేపడుతోంది.
అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి రెస్క్యూ నిర్వహించే అమెరికా వైమానిక దళ ప్రత్యేక సభ్యులను 'స్విస్ ఆర్మీ నైఫ్స్' అని పిలుస్తారని ఒక మాజీ కమాండర్ వెల్లడించారు. ఇప్పుడు ఆ డెడ్లీ కమాండోలనే ఈ ఆపరేషన్ కోసం అమెరికా రంగంలోకి దించిందని బీబీసీ నివేదిక స్పష్టం చేసింది.
ప్రాణాలతో పట్టుకుంటే 66 వేల డాలర్ల రివార్డ్!
అటు అమెరికా తమ వాడిని రక్షించుకోవాలని చూస్తుంటే.. ఇరాన్ మాత్రం ఆ సైనికుడిని సజీవంగా పట్టుకుని అమెరికాను బ్లాక్మెయిల్ చేయాలని పక్కా స్కెచ్ వేసింది. ఆ సైనికుడిని ప్రాణాలతో పట్టుకుని తమకు అప్పగిస్తే ఏకంగా 66,100 డాలర్ల భారీ బహుమతి ఇస్తామని ఇరాన్ అధికారిక మీడియాలో ప్రకటనలు ఇస్తోంది.
ఈ ఆఫర్ చూసి ఇరాన్ ప్రావిన్సులలోని సాధారణ పౌరులు సైతం అమెరికా పైలట్ కోసం వీధుల్లో, అడవుల్లో జల్లెడ పడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
కాల్పుల మధ్య హెలికాప్టర్ల సాహసం..
శుక్రవారం ఎఫ్-15 కూలిపోయిన వెంటనే, విమానాలు కూల్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందే మోహరించి ఉన్న కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ (CSAR) బృందాలు యాక్షన్లోకి దిగాయి. తొలి పైలట్ను రక్షించే సమయంలో ఇరాన్ దళాలు, అమెరికా రెస్క్యూ టీమ్ల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి.
గాలింపు చేపడుతున్న రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్ దాడి చేసినప్పటికీ.. అవి ఇరాన్ గగనతలం నుంచి అత్యంత సురక్షితంగా బయటపడినట్లు ఇద్దరు అమెరికా అధికారులు రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ క్రమంలో రెండు హెలికాప్టర్లు, ఒక విమానం అతి తక్కువ ఎత్తులో ఎగురుతున్న విజువల్స్ కూడా బయటపడ్డాయి.
గాలిలోంచి దూకే పారా జంపర్లు.. బ్యాట్ 21 స్ఫూర్తి!
శత్రు భూభాగంలో రెస్క్యూ ఆపరేషన్ అంటే ప్రాణాలతో చెలగాటమే. ఈ గాలింపు కోసం ఇంధనం నింపే విమానాలు, నిఘా విమానాల సపోర్ట్తో బ్లాక్ హాక్ హెలికాప్టర్లలో కనీసం 24 మంది పారా రెస్క్యూ జంపర్లు క్షణక్షణం సిద్ధంగా ఉంటారు. అవసరమైతే గాలిలో నుంచే కిందకు దూకి వైద్యం అందించి, శత్రువుల కళ్లుగప్పి తమ వాళ్లను తరలించడమే వీరి ప్రథమ లక్ష్యం.
వియత్నాం యుద్ధంలో 'బ్యాట్ 21' మిషన్ వైఫల్యం నుంచి గుణపాఠం నేర్చుకున్న అమెరికా.. ఈ సీఎస్ఏఆర్ (CSAR) వ్యవస్థను అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దింది. ఉత్తర వియత్నాంలో పైలట్ను రక్షించే క్రమంలో అప్పట్లో అమెరికా ఎంతో మంది సైనికులను కోల్పోయింది. ఆ అనుభవంతోనే ఇప్పుడు వైమానిక దళం ఆధ్వర్యంలో పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది.
మిస్సయిన సైనికుడు ప్రాణాలతో తిరిగి అమెరికా బేస్కు చేరితే పశ్చిమాసియా తాత్కాలికంగా ఊపిరి పీల్చుకుంటుంది. కానీ, ఆ సైనికుడు ఇరాన్ పౌరుల చేతికో, అక్కడి ఆర్మీ చేతికో చిక్కితే మాత్రం అమెరికా ప్రతికారం ఊహకందని రేంజ్లో ఉంటుంది. అది నేరుగా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసి, గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను కుప్పకూల్చే అతిపెద్ద ఆర్థిక విస్ఫోటనంగా మారడం ఖాయం. రాబోయే 24 గంటలు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించబోయే అత్యంత కఠిన పరీక్షా సమయం!
Also Read:
అమెరికా vs ఇరాన్: శాంతి చర్చలు ఫ్లాప్.. ఇరాన్ వంతెన నేలమట్టం!రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ట్రంప్ రికార్డ్ బడ్జెట్ ప్రతిపాదన
చమురు సంక్షోభం వేళ భారత్కు అండగా నిలిచిన రష్యా
యుద్ధం ఎఫెక్ట్: సామాన్యుడి దాహానికి చమురు సెగ.. వాటర్ బాటిళ్ల ధరలు పెంపు
జేడీ వాన్స్కు ఫ్రాడ్ జార్ పోస్ట్: ట్రంప్ మాస్టర్ప్లాన్ ఇదేనా?

