దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు సామాన్యులు పసిడిని త్యాగం చేయాలి, విహారయాత్రలు మానుకోవాలి.. మరి పాలకుల మాత్రం ఎనిమిది వేల కోట్ల విమానాల్లో తిరగాలా? కష్టకాలంలో పాలకుల జేబులు నిండుగా ఉండాలి, సామాన్యుడి జేబుకు చిల్లు పడాలా? మధ్యతరగతి గుండెల్లో రగులుతున్న ఈ ప్రశ్ననే ఇప్పుడు జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఏకంగా ప్రధాని మోదీని సూటిగా అడిగారు!
పొదుపు సామాన్యుడికేనా? పాలకులకు లేదా?
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభం కావడం, కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అట్టుడుకుతోంది. ఈ మహా సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఆదివారం హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ సామాన్యులకు ఒక పొదుపు మంత్రాన్ని బోధించారు.
పెట్రోల్, డీజిల్ను ఆదా చేయాలని, వర్క్ ఫ్రం హోం చేయాలని, ఏడాది పాటు బంగారం కొనొద్దని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కానీ, ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో తన 'గోవిష్ట్ యాత్ర' సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ప్రజలను తమ ఖర్చులు తగ్గించుకోవాలని అడిగే ముందు, ఆ పాలకులే ముందుగా ఆదర్శంగా నిలవాలని ఆయన చురకలంటించారు.
8 వేల కోట్ల విమానం అమ్మాకే.. జనం దగ్గరకు రండి!
అమెరికన్ డాలర్ విలువ మన కళ్ల ముందే ఏకంగా రూ. 100కు చేరువవుతుండటం దేశ ఆర్థిక పతనానికి ఒక భయంకరమైన సంకేతం. ఇలాంటి గడ్డు కాలంలో త్యాగం అనేది అధికార పీఠాలపై ఉన్న నాయకుల నుంచే మొదలు కావాలని స్వామీజీ కుండబద్దలు కొట్టారు.
"ధర్మం అనేది ఎప్పుడూ ఇంటి నుంచే మొదలవ్వాలి (Austerity begins at home)" అని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోదీ వినియోగిస్తున్న రూ. 8,000 కోట్ల విలువైన లగ్జరీ వీఐపీ విమానాన్ని ముందుగా అమ్మేయాలని తీవ్ర డిమాండ్ చేశారు. ఆ తర్వాతే తక్కువ ఇంధనం ఖర్చయ్యే విమానాల్లో ప్రయాణించి దేశానికి రోల్ మోడల్గా నిలవాలని బీజేపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
కేరళ, బెంగాల్లో పెరిగాయి.. యూపీలో ఆవులేమయ్యాయి?
కేవలం ఆర్థిక విషయాలకే పరిమితం కాకుండా, హిందుత్వ అజెండాతో అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాల పైనా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గోవధను అరికట్టడంలో రాజకీయ నాయకులు, పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు.
కేరళ (8%), పశ్చిమ బెంగాల్ (15%), జార్ఖండ్ (24%) లాంటి రాష్ట్రాల్లో ఆవుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే.. యూపీలో మాత్రం గోవుల జనాభా దారుణంగా పడిపోయిందని సాక్షాత్తూ ప్రభుత్వ లెక్కలనే ఆయన సాక్ష్యంగా చూపారు.
రాష్ట్రంలోని గోశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోవధకు పాల్పడే చీకటి శక్తుల నుంచి కొందరు నాయకులు డబ్బులు తీసుకుంటూ కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారిని ఓటర్లు గుడ్డిగా నమ్మకూడదని సంచలన ఆరోపణలు చేశారు.
యోగి ఇక సన్యాసి కాదు.. కేవలం ఒక సీఎం మాత్రమే!
ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఉద్దేశించి శంకరాచార్యులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక రాజు స్థానం కంటే ఒక సన్యాసి స్థానం ఎప్పుడూ అత్యున్నతమైనదని ఆయన గుర్తుచేశారు.
కానీ, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవి అనే వ్యామోహంలో పడి తన ఉన్నతమైన సన్యాస స్థానం నుంచి అమాంతం కిందకు దిగజారిపోయారని విమర్శించారు. ప్రస్తుతం ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమేనని, పీఠాధిపతి లేదా సన్యాసి ఏమాత్రం కాదని తేల్చి చెప్పారు.
వచ్చే ఎన్నికలకు 'గోవిష్ట్ యాత్ర' హెచ్చరిక!
గోమాతను రక్షించాల్సిన బాధ్యతను పక్కనపెట్టిన నాయకులకు బుద్ధి చెప్పేందుకే, గోవులను ప్రేమించే ఓటర్లను మేల్కొల్పడానికి తాను ఈ యాత్ర చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలను నిలదీసేలా.. గోవుల సంరక్షణ, వాటి గౌరవాన్ని పునరుద్ధరించడంపై ఓటర్లలో అవగాహన కల్పించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని శంకరాచార్యులు తేల్చిచెప్పారు.
దేశ భారం మోయాల్సింది సామాన్యుడేనా?
చమురు మంటలు, యుద్ధ భయాలతో దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు కాస్త వెనక్కి తగ్గక తప్పదు. కానీ, డాలర్ విలువ రూ.100 దాటుతున్న వేళ, వ్యవస్థలోని లోపాలను కప్పిపుచ్చుకుంటూ ఆ భారాన్ని కేవలం సామాన్యుడి జేబుపైనే మోపడం ఎంతవరకు సబబు? శంకరాచార్యులు సూటిగా అడిగినట్లు, వీఐపీ సంస్కృతికి, వేల కోట్ల విమానాలకు స్వస్తి పలకకుండా.. సామాన్యుడిని బండి తియ్యొద్దు అనడం హాస్యాస్పదం. ప్రభుత్వ ఖజానాలోంచి వృధా ఖర్చులు తగ్గిన రోజున, సామాన్యుడు కూడా సంతోషంగా తనవంతుగా దేశం కోసం పసిడిని త్యాగం చేస్తాడు!
Also Read:
Tamil Nadu Floor Test : దళపతి విజయ్ బలపరీక్ష ఉత్కంఠAIADMK MLAs Support Vijay: సీఎం దళపతికి రెబల్స్ జై
Bengaluru Cost of Living: బెంగళూరులో ఐటీ జంట కష్టాలు
రెండుగా చీలుతున్న అన్నాడీఎంకే.. పళనిస్వామికి కోలుకోలేని షాక్!
కోట్ల మంది అభిమానులు.. కానీ సొంత ఇంట్లోనే నిశ్శబ్దం: విజయ్ కుటుంబ వివాదం వెనుక నిజాలు

