ఓటుకు ఉన్న పవర్ ఏంటో తెలుసా? 15 ఏళ్ల పాటు ఎదురులేని శక్తిగా ఏలిన ఒక మహా సామ్రాజ్యాన్ని కూడా సగటు సామాన్యుడి ఆగ్రహం పేకమేడలా కూల్చేయగలదు! మహిళలకు రక్షణ లేనప్పుడు, నిరుద్యోగికి భవిష్యత్తు లేనప్పుడు, అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు.. పాలకుల కుర్చీలు కదలక తప్పదని పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. సామాన్యుడి బతుకును మార్చే ఈ చారిత్రక తీర్పులో మమతా బెనర్జీ (టీఎంసీ) పతనానికి దారితీసిన ఆ ఐదు సంచలన కారణాలు ఏంటో ప్రతి పౌరుడూ తెలుసుకోవాలి!
మహిళాగ్రహం.. దీదీకి అసలైన గుణపాఠం!
మమతా బెనర్జీకి మహిళా ఓటర్లే ఎప్పుడూ అతిపెద్ద బలం. కానీ, అదే మహిళా లోకం ఈసారి ఆమెపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయింది. 2012 నాటి పార్క్ స్ట్రీట్ ఘటనపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఒకప్పుడు దుమారం రేపితే.. ఇటీవల కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్పై జరిగిన కిరాతక హత్యాచార ఘటన ఆ మంటలకు మరింత ఆజ్యం పోసింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత కరువైందన్న భయాలు టీఎంసీ ఓటు బ్యాంకును నిలువునా చీల్చేశాయి.
నోట్ల కట్టల కుంభకోణాలు.. పరువు తీసిన వీడియోలు!
టీఎంసీ హయాంలో వెలుగుచూసిన భారీ అవినీతి కుంభకోణాలు ఆ పార్టీ ప్రతిష్టను పాతాళానికి తొక్కేశాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు గడప తొక్కిన టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం నిరుద్యోగుల ఉసురు పోసుకుంది. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అనుచరుల ఇళ్లలో బయటపడిన కోట్లాది రూపాయల గుట్టల వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో జనం ఉలిక్కిపడ్డారు. పాత శారద, నారద స్కామ్లు కూడా సరిగ్గా ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి రావడంతో.. టీఎంసీ నేతలంతా అవినీతిపరులే అన్న ప్రతిపక్షాల వాదనను ప్రజలు బలంగా నమ్మారు.
89 లక్షల ఓట్ల తొలగింపు.. చెదిరిన చొరబాటుదారుల ఓటు బ్యాంకు!
బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను మమత సర్కార్ గుడ్డిగా ప్రోత్సహించిందన్న ఆరోపణలు దీదీ కొంపముంచాయి. వలసదారులు ఇక్కడే ఓటు హక్కు సంపాదించి, స్థానికుల పొట్టగొడుతున్నారన్న ఆగ్రహం బెంగాలీల్లో రగిలింది. సరిగ్గా ఇదే సమయంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో ఏకంగా 89 లక్షల బోగస్ ఓట్లను ఏరిపారేశారు. ఇందులో అత్యధిక శాతం బంగ్లాదేశీయులేనని, వారంతా టీఎంసీకి ఓటు వేయలేకపోవడం వల్లే దీదీ ఓటమి ఖాయమైందని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.
15 ఏళ్ల పాలన.. కమలం మాస్టర్ స్ట్రోక్!
వరుసగా 15 ఏళ్ల పాటు సాగిన పాలన, క్షేత్రస్థాయిలో స్థానిక నేతల దౌర్జన్యాలు, నిరుద్యోగం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. కేంద్ర నిధుల కోసం కేంద్రంతో దీదీ చేసిన అనవసర పోరాటాలు రాష్ట్ర అభివృద్ధికి శాపంగా మారాయని ఓటర్లు భావించారు. ఈడీ, సీబీఐ దాడులను మమత రాజకీయ కుట్రగా కొట్టిపారేసినా.. బీజేపీ మాత్రం వాటిని అవినీతిపై చేస్తున్న ధర్మపోరాటంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. దీనికి తోడు హిందూ ఓట్ల ఏకీకరణ, కేంద్ర పథకాల ప్రచారం బీజేపీకి అనూహ్యమైన మైలేజ్ తెచ్చిపెట్టి టీఎంసీని వెనక్కి నెట్టాయి.
మహిళలకు భద్రత ఇవ్వలేని, నిరుద్యోగుల కడుపు కొట్టే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ ఈ ఫలితాలను చూసి గుణపాఠం నేర్చుకోవాలి. సామాన్యుడి ఓటు కేవలం సిరా చుక్క కాదు.. అది అవినీతి సామ్రాజ్యాలను కూల్చేసే టైమ్ బాంబ్!
Also Read:
బెంగాల్లో బీజేపీ విజయం: బంగ్లాదేశ్లో వణుకుతమిళనాట మ్యాజిక్ ఫిగర్ టెన్షన్: సీఎం కుర్చీ కోసం విజయ్ ముందున్న 3 దారులివే!
కేరళలో కుప్పకూలిన ఎర్రకోట.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?
TN Election Results : నిజమైన పీకే జోస్యం, 106 స్థానాల్లో విజయ్ టీవీకే
అమిత్ షా చాణక్యం, మోదీ ఛరిష్మా: బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా

