ప్రభుత్వ బడుల తలరాతను మారుస్తూ.. పేద బిడ్డల కళ్లల్లో అంతర్జాతీయ స్థాయి చదువుల కాంతులు నింపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త విద్యా విప్లవానికి తెరతీశారు. హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగిన విద్యా వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ఏకంగా రూ.1100 కోట్ల భారీ బడ్జెట్తో పేద విద్యార్థుల తలరాతను మార్చే విప్లవాత్మక నిర్ణయాలను వెల్లడించారు.
కార్పొరేట్ను మించేలా ఎడ్యుకేషన్ కిట్!
ప్రభుత్వ బడికి వెళ్లే ప్రతి బిడ్డా ఇకపై ఆత్మగౌరవంతో తలెత్తుకుని నడిచేలా ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ కిట్ అందించబోతున్నారు. కేవలం పాతబడిపోయిన పుస్తకాలే కాకుండా.. నోట్ బుక్స్, నాణ్యమైన బ్యాగులు, షూస్ సహా మొత్తం తొమ్మిది రకాల వస్తువులతో ఈ కిట్ ముస్తాబవుతోంది. స్కూల్ తెరిచిన రోజే ఒక జత యూనిఫాం, నెలాఖరుకల్లా రెండో జత అందించాలని సీఎం కఠిన ఆదేశాలు జారీ చేశారు. పేద పిల్లల బట్టలు, వస్తువుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడినా.. ఆ సరఫరా కంపెనీలను శాశ్వతంగా బ్లాక్ లిస్టులో పెడతామని ఆయన చేసిన హెచ్చరికల వెనుక ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
ఆకలి తీరితేనే అక్షరం వంటబడుతుంది!
కడుపు నిండా తిండి ఉంటేనే.. బుర్రకు చదువు ఎక్కుతుంది! ఈ సత్యాన్ని గ్రహించిన ప్రభుత్వం, కొడంగల్లో విజయవంతమైన పైలట్ ప్రాజెక్టును ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ బడిలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఉదయాన్నే విద్యార్థులకు పాలు, రాగి జావ వంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తారు. దీనికి తోడుగా.. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ కాస్మోటిక్ చార్జీలను ఏకంగా 200 శాతం, డైట్ చార్జీలను 40 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పేదవాడి ముంగిట ఇంటర్నేషనల్ స్కూల్స్.. ఫిన్లాండ్కు టీచర్లు!
సామాన్య విద్యార్థులకు కూడా ఇంటర్నేషనల్ స్కూల్ వసతులు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి మరో బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. సుమారు రూ.1011 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన చేశారు. మొత్తం 100 నియోజకవర్గాల్లో ఏకంగా రూ.20 వేల కోట్లతో ఈ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతోంది. మరోవైపు విద్యాబోధనలో వేగం పెంచుతూ, కేవలం 60 రోజుల్లో 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడమే కాకుండా.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను విదేశీ శిక్షణ కోసం ఏకంగా ఫిన్లాండ్ పంపాలని తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వ్యసనాలకు దూరం.. విద్యా రంగానికి భారీ ఊతం!
చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యమే. అందుకే జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభమయ్యే రోజున గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సమక్షంలో విద్యార్థులతో ఒక భారీ ప్రతిజ్ఞ చేయించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మాదకద్రవ్యాలు, మద్యం, పొగాకు వంటి మహమ్మారులకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ప్రమాణం చేయించి, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దనున్నారు. విద్యాశాఖ బాధ్యతలను తన భుజాలపైనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులను 15 శాతానికి పెంచుతామని భరోసా ఇచ్చారు.
ఒక నాయకుడు కేవలం రేపటి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు.. కానీ ఒక దార్శనికుడు మాత్రమే రేపటి తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు అనడానికి తెలంగాణలో మొదలైన ఈ విద్యా విప్లవమే సజీవ సాక్ష్యం!
Also Read:
వరంగల్ శివాలయం కూల్చివేత: రంగంలోకి కేంద్ర పురావస్తు శాఖ, అధికారులపై కేసుకూకట్పల్లి వ్యభిచార ముఠా గుట్టురట్టు.. సీపీ సుమతి ఇన్స్పైరింగ్ స్టోరీ
వరంగల్లో రోడ్డెక్కిన రైతులు : కొనుగోళ్లలో జాప్యంపై రాస్తారోకో!
రీఛార్జ్ కోసం ఒకరు.. డబ్బు కోసం మరొకరు: నగరంలో విషాదాలు!
తెలంగాణ జాగృతికి గుడ్బై: కొత్త పార్టీ అజెండాను ప్రకటించిన కవిత

