[FEATURED_IMAGE]
మహానటి', 'సీతా రామం', 'కల్కి 2898 AD' వంటి అద్భుతమైన చిత్రాలతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ 'యామ్ గేమ్'. భారీ అంచనాల మధ్య ఆగస్టు 20న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని రెండు వారాల పాటు పోస్ట్పోన్ చేస్తూ సెప్టెంబర్ 3కి మార్చారు. అయితే ఈ వాయిదా వెనుక మేకర్స్ పక్కా మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
సినిమా ఔట్పుట్ అద్భుతంగా రావడంతో, దానికి తగ్గట్లే ప్రమోషన్స్ మరియు థియేట్రికల్ కౌంట్ పెంచాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ సినిమాను మలయాళం, తెలుగు, హిందీ, కన్నడతో పాటు ఆంగ్ల భాషలో కూడా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. అందుకే హడావిడిగా కాకుండా, ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్కు సరైన ప్లాట్ఫార్మ్ క్రియేట్ చేయడానికి మరింత సమయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ అదనపు సమయంతో సినిమాకు తగిన స్థాయిలో థియేటర్లు దొరుకుతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మలయాళంలో 'ఆర్డీఎక్స్' (RDX) లాంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ సినిమాను తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడి ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ఈ చిత్రంలో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. దుల్కర్కు జంటగా కాయదు లోహర్ నటిస్తుండగా.. మలయాళ యాక్షన్ హీరో యాంటోనీ వర్గీస్, కోలీవుడ్ విలక్షణ దర్శకుడు మిస్కిన్, కదిర్, సంయుక్త విశ్వనాథన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై క్యూరియాసిటీని అమాంతం పెంచేశాయి. దుల్కర్ సల్మాన్ మార్కెట్ స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్, వాయిదా పడటం ఫ్యాన్స్ను కాస్త నిరాశపరిచినా.. అవుట్పుట్ అదిరిపోయే రేంజ్లో రానుందని నమ్మకంగా ఉన్నారు. మరి సరైన థియేట్రికల్ రిలీజ్ కోసం పోస్ట్పోన్ అయిన ఈ 'యామ్ గేమ్' సెప్టెంబర్ 3న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

