సంక్రాంతి పండుగ వస్తుందంటే సామాన్య ప్రేక్షకుడికి ముందుగా గుర్తొచ్చేది థియేటర్ల వద్ద జరిగే బాక్సాఫీస్ జాతర. పండుగ పూట ఫ్యామిలీతో కలిసి మంచి సినిమా కోసం వందలు ఖర్చుపెట్టే ప్రేక్షకుడి ముందు ఈసారి ఆప్షన్స్ గట్టిగానే ఉండబోతున్నాయి. ఇప్పటికే అగ్ర హీరోల సినిమాలతో సంక్రాంతి బరి వేడెక్కగా.. ఇప్పుడు ఆ రేసులోకి మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ సడెన్ ఎంట్రీ ఇచ్చారు. గత రెండేళ్లుగా అతీగతీ లేకుండా, జనాలు దాదాపు మర్చిపోయిన 'సంబరాల ఏటిగట్టు' సినిమాకు అకస్మాత్తుగా రిలీజ్ డేట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు ఇంత గ్యాప్ తర్వాత వస్తున్న ఈ పీరియాడిక్ మూవీకి అంత సీన్ ఉందా? సంక్రాంతి లాంటి ప్రతిష్ఠాత్మక సీజన్లో తేజ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
[FEATURED_IMAGE]
సంక్రాంతి బరిలో సడెన్ ఎంట్రీ
మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ నుంచి వరుణ్ తేజ్ వరకు రీసెంట్గా సక్సెస్ ట్రాక్ ఎక్కారు. కానీ, సాయితేజ్ మాత్రం 'సంబరాల ఏటిగట్టు' ప్రాజెక్ట్ తో గత రెండేళ్లుగా సెట్స్పైనే ఉండిపోయారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను వదులుతూ, వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను.. బ్లాక్బస్టర్ 'హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండటం సినిమాపై కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, ఈసారి సంక్రాంతి బరిలో వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమాతో పాటు శర్వానంద్ 'జార్జ్ క్రిష్' ఇప్పటికే డేట్స్ లాక్ చేసుకున్నాయి. దీనికి తోడు మామయ్య చిరంజీవి - బాబీ ప్రాజెక్ట్ కూడా పండుగకే వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఒకవేళ మామయ్యతో పోటీ వస్తే తేజ్ వెనక్కి తగ్గుతాడా, లేదా బరిలో నిలుస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
పాన్ ఇండియా రేంజ్లో ప్రయోగం
మరోవైపు ఈ సినిమాను మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులోనే సాయితేజ్కు ఒక మోస్తరు మార్కెట్ ఉండగా.. ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో ఈ ప్రయోగం ఏ మేర వర్కౌట్ అవుతుందనేది ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఏళ్ల తరబడి సాగుతున్న ఒక ప్రాజెక్ట్ను నేరుగా సంక్రాంతి లాంటి పెద్ద సీజన్లో రిలీజ్ చేయడం నిజంగా సాహసమే. నిర్మాత నిరంజన్ రెడ్డి 'హనుమాన్' తరహాలో కంటెంట్పై ఉన్న నమ్మకంతోనే ఈ డేరింగ్ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. అయితే కేవలం 'పాన్ ఇండియా' అనే ట్యాగ్ వేసుకుంటే జనాలు థియేటర్లకు రారు. కంటెంట్లో దమ్ముంటేనే చిరంజీవి, వెంకటేష్ లాంటి ఉద్దండుల ముందు ఈ సినిమా నిలబడుతుంది. లేదంటే బాక్సాఫీస్ వద్ద భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సాయితేజ్ కెరీర్ను డిసైడ్ చేసే అసలైన లిట్మస్ టెస్ట్ ఇదే!


