హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఈ అందాల తార, వరుస హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి తెలుగు స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న ఘనత ఆమెకు దక్కింది. అయితే, గత మూడేళ్లుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఒకప్పుడు వరుస హిట్లు, బ్లాక్ బస్టర్లతో దూసుకుపోయిన ఈ నటి ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేకుండా ఉంది. కానీ తమిళ్ మరియు హిందీ సినిమాల్లో మాత్రం ఆమె బిజీగా గడుపుతోంది.
హిందీలో నిరాశ - తమిళంలో బిజీ
ఇటీవలే షాహిద్ కపూర్ హీరోగా నటించిన 'దేవా' అనే హిందీ సినిమాలో పూజా హెగ్డే నటించింది. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ అమ్మడు సూర్య సరసన ఒక రెట్రో సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ను కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలో పూజా హెగ్డే తెలుగులో పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది.
కన్నడలో నటించాలని ఉంది కానీ.. - పూజా హెగ్డే
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ, తన కుటుంబం నుంచి కన్నడ సినిమాల్లో నటించాలనే ఒత్తిడి ఉందని తెలిపింది. "నేను కర్ణాటక నుంచి వచ్చాను, నేను తుళు అమ్మాయిని. కాబట్టి కన్నడ భాషలో సినిమాలు చేయాలని నా తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఇప్పటివరకు నేను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేశాను. కన్నడ సినిమా కథలను కూడా కొన్ని విన్నాను. కానీ అవి నన్ను అంతగా ఆకట్టుకోలేదు. మంచి కథ దొరికితే తప్పకుండా కన్నడ భాషలో నటిస్తాను. నా తల్లిదండ్రులు ఎప్పటినుంచో అడుగుతున్నారు" అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.