పెళ్లంటే ఎన్నో ఆశలు, ఎన్నో భావోద్వేగాలు! అమ్మాయి, అబ్బాయి మనసులు కలవాలి. రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పడాలి. అప్పుడే కదా పెళ్లి సందడి కనిపించేది! కర్ణాటకలో జరిగిన ఓ పెళ్లిలో చివరి నిమిషంలో ఊహించని ఘటన జరిగింది. తాళి కట్టే సమయానికి పెళ్లి వద్దంటూ వధువు కన్నీరుమున్నీరయింది. ఇది చూసి తల్లిదండ్రులు, బంధువులు షాకయ్యారు.
కర్ణాటకలోని హాసన్ మండలం బూవనహళ్లి గ్రామానికి చెందిన యువతికి, ఆలూరు తాలూకా యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఆహ్వాన పత్రికలు పంచారు. పెళ్లి బట్టలు, బంగారం ఇలా అన్ని కొనుగోలు చేశారు. చుంచనగిరి కల్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేశారు. బంధువులంతా హాజరయ్యారు. పెళ్లి తంతును తిలకించారు.
ప్లేటు ఫిరాయించిన వధువు
కాళ్లు కడగడం, జీలకర్ర-బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచడం, కన్యాదానం, సువర్ణజలాభి మంత్రం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చాయి. చివరికి మూడు ముళ్ల తంతు.. అందరూ ఆసక్తిగా ఆ ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వధువుకు ఓ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత నుంచి ఆమె ఏడుపు లఖించుకుంది. ఏంటా అని అడిగేసరికి.. ప్లేటు ఫిరాయించింది. తనకు ఈ పెళ్లి వద్దంటూ తెగేసి చెప్పింది. ఈ హఠాత్ పరిణామం ఇరు కుటుంబాలనే కాదు.. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.
ఎందుకిలా చేస్తున్నావని బంధువుల ప్రశ్నలు
కన్నవాళ్లు, అయినవాళ్లు అందరూ ఎందుకిలా చేస్తున్నావని వధువును ప్రశ్నించారు. ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ వధువు ఎవరి మాటా వినలేదు. పెళ్లి ఆగిపోయిన విషయం తెలుసుకున్న పోలీసులు కూడా పెళ్లి మండపానికి వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీశారు. అప్పుడు వధువు నోరు విప్పింది.. తాను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది. దీంతో అక్కడున్న వారందరూ నోరెళ్లబెట్టారు.
యువతిపై బంధువుల ఆగ్రహం
వధువు అలా చెప్పడంతో వరుడు కూడా చివరికి పెళ్లి వద్దని చెప్పేశాడు. అతను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. వివాహ కార్యక్రమానికి వచ్చిన బంధువులంతా తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ప్రేమించిన మాట ముందే చెప్పకుండా.. మండపం దాకా ఎందుకు తీసుకొచ్చిందంటూ యువతిని తిట్టిపోశారు. చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోవడం సినిమాల్లో చూస్తుంటాం.. కానీ ఇక్కడ మాత్రం స్వయంగా చూసి వెళ్లారు.