క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) అంటే ఏమిటి? మూత్రపిండాల సమస్యలు, లక్షణాలు, నివారణ

naveen
By -
0

 



మన శరీరంలో మూత్రపిండాల (కిడ్నీల) పనితీరు అత్యంత కీలకం. ఇవి తొలుత కొంతవరకు తమను తాము రిపేర్ చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ఒక స్థాయి దాటి దెబ్బతింటే మాత్రం స్వయంగా చక్కబరచుకోలేవు. అంతేకాకుండా, మన శరీరంలో రెండు కిడ్నీలు ఉండటం వల్ల, ఒకటి సరిగా పని చేయలేకపోయినా, దాని బాధ్యతను మరొకటి తీసుకుంటుంది. దీనివల్ల, కిడ్నీలు పూర్తిగా పనిచేయలేని పరిస్థితికి వచ్చేదాకా మనకు ఆ విషయం తెలియకపోవచ్చు. అందుకే, వాటికి ఆ స్థితి రాకముందే మనం అప్రమత్తం కావాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డయాబెటిస్ (మధుమేహం) లేదా హైబీపీ (అధిక రక్తపోటు) తో బాధపడుతుంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే, దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు (Chronic Kidney Disease - CKD) వచ్చే అవకాశం ఉంది. ఈ "సీకేడీ"పై అవగాహన కల్పించడమే ఈ కథనం ఉద్దేశ్యం.

క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) అంటే ఏమిటి?

ముందు చెప్పుకున్నట్లుగా, కిడ్నీలు దీర్ఘకాలం పాటు (కనీసం మూడు నెలలపాటు) సరిగా పనిచేయని పరిస్థితిని ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ అంటారు. రెండు కిడ్నీలలో ఏ ఒక్కటి సరిగా పనిచేయకపోయినా, దాని బాధ్యతను పక్క కిడ్నీ తీసుకోవడం వల్ల సీకేడీని చాలా ఆలస్యంగా గుర్తిస్తారని చెప్పుకున్నాం కదా. అలా చేయిదాటిపోయాక కిడ్నీల పనితీరు మెల్లమెల్లగా మరింత దెబ్బతింటూ పోతున్నకొద్దీ, రోగి బాధ మరింతగా పెరుగుతుంది.

కిడ్నీల విధులు & లోపాల వల్ల కలిగే పరిణామాలు

మన దేహంలోని మలినాలను బయటకు విసర్జించడంతోపాటు, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, విటమిన్-డి వంటి లవణాలు, ఖనిజాలు, విటమిన్లతోపాటు ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్‌ను కూడా కిడ్నీలు నియంత్రిస్తూ ఉంటాయి. ఈ నియంత్రణ ప్రక్రియ సరిగా జరగకపోవడం వల్ల దేహంలో సోడియం తగ్గిపోవడం, పొటాషియం, ఫాస్ఫరస్ మోతాదు పెరగడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

కిడ్నీ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నవారు

సాధారణంగా ఈ క్రింద పేర్కొన్న ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ:

  • డయాబెటిస్
  • హైపర్‌ టెన్షన్ (అధిక రక్తపోటు)
  • కిడ్నీలో రాళ్లు
  • మల్టిపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్లు
  • మూత్రంలో ప్రోటీన్ మోతాదులు ఎక్కువగా ఉండటం (ప్రోటీన్ యూరియా)
  • మూత్రంలో రక్తం
  • మాంసాహారం, ఉప్పు ఎక్కువగా తినడం

కనిపించే లక్షణాలు

మూత్రపిండాల సమస్యతో బాధపడేవారికి సాధారణంగా కాళ్ల వాపులు, ముఖం వాపు, పొట్ట ఉబ్బరం, నీరసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలుంటాయి. నీరసం చాలా ఎక్కువగా ఉంటుంది. నిలబడినా, కూర్చున్నా చాలా ఆయాసపడతారు. దీనివల్ల తమ రోజువారీ పనులు చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి.

సమస్య తీవ్రత & పరిణామాలు

కిడ్నీ సమస్యతో బాధపడేవారిలో 50 శాతం మందికి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కేవలం రక్తపోటు, డయాబెటిస్ వల్ల మాత్రమే కాకుండా కిడ్నీ జబ్బులవల్ల కూడా వచ్చే ముప్పు ఉంటుంది. మనం తొలిదశలోనే కిడ్నీ సమస్యలను గుర్తించకపోతే రక్తం తగ్గడం (అనీమియా), ఎముకలు బలహీనపడటం, గుండెతోపాటు ఊపిరితిత్తుల్లోనూ నీరు చేరడం వంటి సమస్యలకు దారి తీయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రోగికి డయాలసిస్ తప్పనిసరి. అయితే అలాంటి పరిస్థితిని తెచ్చుకోవడం అంటే అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయినట్లే.

నాటు వైద్యం/తప్పుడు అవగాహనతో నష్టం

ఇలాంటి కండిషన్‌లో ఉన్నవారిలో కొందరు ఇతరత్రా వైద్య ప్రక్రియలు, నాటు వైద్యాలంటూ ప్రత్యామ్నాయాల కోసం వెళ్లి వ్యాధిని మరింతగా ముదరబెట్టుకుంటారు. కొన్ని ప్రక్రియల వల్ల వ్యాధిని సూచించే క్రియాటినిన్ అనే రసాయనం తాత్కాలికంగా తగ్గినట్లుగా పరీక్షల్లో కనిపించవచ్చు. కానీ, ఆ నాటు వైద్యాల్లో ఉపయోగించే మందులు, రసాయనాలను శుద్ధి చేసే బాధ్యత మూత్రపిండాలపై అధికంగా పడి, అవి మరింతగా దెబ్బతింటాయి. ఇక కొందరు తాము అన్నం తగ్గిస్తే రక్తంలో చక్కెర తగ్గుతుందంటూ ఆహారం పరిమితంగా తీసుకోవడం లేదా సరిగా తీసుకోకపోవడం చేస్తుంటారు. ఇది కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇలా ఆహారం తీసుకోకపోవడం, మందులు సరిగా వాడకపోవడం వల్ల ఎప్పుడో రావాల్సిన మూత్రపిండాల సమస్య 10 లేదా 15 ఏళ్ల ముందుగానే రావచ్చు.

కిడ్నీ సమస్య దశలు & ముందుస్తు గుర్తింపు

మూత్రపిండాల సమస్యను ఐదు దశలుగా వర్గీకరించవచ్చు. మొదటి దశలో కిడ్నీ పనితీరు 35 నుంచి 50 శాతం దెబ్బతింటుంది. లక్షణాలు పెద్దగా కనిపించవు. ఇలా క్రమంగా పనితీరు తగ్గుతూ పోతూ రెండూ, మూడు, నాలుగు దశలు దాటవచ్చు. ఆయా దశల్లో ఎప్పుడైనా ఇతర వ్యాధులకు నిర్వహిస్తున్న పరీక్షల్లో కిడ్నీ సమస్య బయటపడవచ్చు. సమస్య ఐదో దశకు చేరిందంటే ఇక అది ఏమాత్రం బాగు చేయలేని చివరి దశ అన్నమాట. దాన్నే ‘ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్’ (ESRD) గా చెబుతారు. అందుకే డయాబెటిస్, హైపర్‌ టెన్షన్ (హైబీపీ) ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ తొలిదశలోనే గుర్తిస్తే వ్యాధిని మందులతోనే తగ్గించవచ్చు. చాలామంది కిడ్నీ సమస్య అంటే దానికి డయాలసిస్ తప్పదనే భావనతో నెఫ్రాలజిస్టు (కిడ్నీ డాక్టరు) దగ్గరికి వెళ్లి పరీక్ష చేయించుకోడానికి వెనుకాడతారు. కానీ, కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచుకొని ముందే పరీక్ష చేయించుకుంటే అసలు సమస్యను ఎప్పటికీ డయాలసిస్ వరకు రాకుండా నివారించుకోవచ్చు.

కిడ్నీ పనితీరును అంచనా వేయడానికి పరీక్షలు

‘సీరమ్ క్రియాటినిన్’ అనే పరీక్షతో కిడ్నీ సమస్య ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. ఇది చాలా చిన్నదీ, చవకైన పరీక్ష. చిన్నపాటి సమస్య వస్తుందనిపించినప్పుడు లేదా వచ్చిందనుకున్నప్పుడు తొలి ఏడాదిలో మూడు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత ఏడాదికోసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మూత్రపిండాల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చు.

కిడ్నీ బయాప్సీ: కారణాలు, ఉపయోగాలు

కిడ్నీ బయాప్సీ అనేది కిడ్నీ సమస్యలను మరింత లోతుగా విశ్లేషించడానికి చేసే ప్రక్రియ. ఈ పరీక్షను చేసుకోవడానికి మీ డాక్టర్ ఈ కింది కారణాలను బట్టి ఆదేశిస్తారు:

  1. ఇతర పద్ధతులతో వ్యాధిని నిర్ధారించలేనప్పుడు.
  2. కిడ్నీల పరిస్థితులను తెలుసుకొని దానికి మెరుగైన చికిత్సను అందించడానికి అవకాశం ఉంటుంది.
  3. కిడ్నీ జబ్బు అనేది ఎంత తొందరగా తీవ్రం అవుతుందో తెలుసుకోవచ్చు.
  4. కిడ్నీలు ఎంత వరకు దెబ్బతిన్నాయో తెలుసుకోవచ్చు.
  5. కిడ్నీ చికిత్స ఎంతవరకు పని చేస్తున్నది, కిడ్నీ ఆరోగ్యం ఎంత మెరుగుపడింది వంటి విషయాలపై అవగాహన పెంచుకోవచ్చు.
  6. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన కిడ్నీ ఆరోగ్యాన్ని లేదా అది ఎందుకు సరిగా పని చేయటం లేదో తెలుసుకోవచ్చు. ఇంకేదైనా సమస్యలున్నా కూడా ఇందులో కనుక్కోవచ్చు.
  7. మీ రక్త లేదా మూత్ర పరీక్షలో కింద తెలిపిన విధంగా ఉంటే బయాప్సీ పరీక్షను చేసుకోవడానికి మీ డాక్టర్ ఆదేశిస్తారు:
  8. మూత్రంలోని రక్తం కిడ్నీ నుంచి రావడం.
  9. ప్రోటీన్ శాతం (ప్రోటీన్ యూరియా) మూత్రంలో ఎక్కువగా ఉంటే లేదా ఇతర ఏదైనా కిడ్నీ సమస్యలు ఉన్నట్టుగా అనిపిస్తే.
  10. కిడ్నీ పనితీరు సరిగా ఉండకపోవడం లేదా మూత్రంలో వ్యర్థాలు ఎక్కువగా ఉండటం.

పైన తెలిపిన లక్షణాలున్న అందరికీ బయాప్సీ పరీక్ష అవసరం ఉండకపోవచ్చు. మీకు ఉన్న లక్షణాలు, రక్త పరీక్షలను బట్టి బయాప్సీ చేసుకోవాలా? వద్దా? అని డాక్టర్ నిర్ణయిస్తారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!