విశాఖలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక రికార్డే! కానీ, అంతకంటే పెద్ద సంచలనం.. ఈ సదస్సు తర్వాత అక్కడ ఒక్క గ్రాము చెత్త కూడా మిగలకపోవడం!
విశాఖలో ఈ నెల 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్న పెట్టుబడుల సదస్సును కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం గత మూడు నెలలుగా భారీ ఏర్పాట్లు చేస్తోంది.
10 లక్షల కోట్లు.. జీరో వేస్ట్!
ఈ సదస్సులో వందల సంఖ్యలో ఒప్పందాలు కుదరడం ఒక రికార్డు అయితే, పది లక్షల కోట్ల దాకా పెట్టుబడులు రావడం మరో రికార్డు. ఇప్పుడు వీటితో పాటు ఇంకో సరికొత్త రికార్డు నమోదు కాబోతోంది. అదే 'జీరో వేస్ట్' (Zero Waste).
ఒక పెద్ద ఈవెంట్ చేసినప్పుడు, వేస్టేజ్ గుట్టలుగా పేరుకుపోతుంది. కానీ విశాఖ సమ్మిట్ దానికి కొత్త రూట్ కనుగొంది. వేల సంఖ్యలో పెట్టుబడిదారులు, అతిథులు రెండు రోజుల పాటు పాల్గొన్నా, వ్యర్థాలు మాత్రం 'సున్నా' అని నిర్వాహకులు కచ్చితంగా చెబుతున్నారు.
భూమిలో పాతిపెట్టే ప్రసక్తే లేదు!
విశాఖలో సీఐఐ (CII) భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ సమ్మిట్, దేశానికి గొప్ప సందేశం ఇస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే ప్రతీ వ్యర్థ పదార్థాన్ని ఏదో ఒక విధంగా తిరిగి ఉపయోగించడం (Reuse) లేదా రీసైకిల్ చేయడం చేస్తారు.
చెత్తను గుట్టగా పేర్చి భూమిలో పాతిపెట్టేది కానీ, పర్యావరణానికి విఘాతం కలిగించేది కానీ ఏమీ ఉండదని స్పష్టం చేస్తున్నారు.
ప్లాస్టిక్ బ్యాన్.. కంపోస్టింగ్ యూనిట్లు
ఈ 'జీరో వేస్ట్' టార్గెట్ను చేరుకోవడానికి నిర్వాహకులు పక్కా ప్రణాళిక వేశారు. సదస్సు ప్రాంగణంలో ప్రత్యేక కంపోస్టింగ్ యూనిట్లను, వ్యర్థాల విభజన కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అధీకృత రీసైక్లర్లతో ఇప్పటికే టైఅప్ చేసుకున్నారు.
సదస్సు వేదిక వద్ద ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించబడింది. దానికి బదులుగా బయోడిగ్రేడబుల్ కప్పులు, ప్లేట్లు, గాజు, బంకమట్టి కంటైనర్లను మాత్రమే వినియోగిస్తున్నారు.
డిజిటల్ స్క్రీన్లు.. బట్ట బ్యానర్లు
ఈ సదస్సు ప్రచారం కోసం కూడా ప్లాస్టిక్కు బదులు పూర్తిగా బట్టతో తయారు చేసిన బ్యానర్లనే వాడారు. చాలా వరకు సమాచారాన్ని డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. తద్వారా కాగితం వ్యర్థాలను కూడా తగ్గించి, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
దేశానికి రోల్ మోడల్
విశాఖ సదస్సు కేవలం పెట్టుబడులకే కాదు, పర్యావరణ స్పృహకు కూడా ఒక రోల్ మోడల్గా నిలవబోతోంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టికి, దార్శనికతకు నిదర్శనమని అధికారులు అంటున్నారు. ఆర్థికంగా పెట్టుబడులు సాధిస్తూనే, పర్యావరణ పరిరక్షణకు ఏమి చేయాలో ఈ సదస్సు దేశానికి చాటి చెబుతోంది.

