బాలయ్య బాబు సినిమా రిలీజ్ అంటేనే రచ్చ మామూలుగా ఉండదు. కానీ 'అఖండ 2' విషయంలో మాత్రం ఫ్యాన్స్కు టెన్షన్ తప్పట్లేదు. ఏపీలో టికెట్లు తెగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం కలవరపెడుతోంది.
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2: తాండవం' (Akhanda 2) విడుదల విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 12న సినిమా రిలీజ్ కానుండగా, రేపు రాత్రి (డిసెంబర్ 11) ప్రీమియర్ షోలు వేయాలని ప్లాన్ చేశారు. అయితే, టికెట్ బుకింగ్స్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
ఏపీలో లైన్ క్లియర్.. రేట్ల పెంపుకి ఓకే!
ఆంధ్రప్రదేశ్లో 'అఖండ 2' జాతర అప్పుడే మొదలైంది. ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా టికెట్ రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్డేటెడ్ జీవో (G.O) జారీ చేయడంతో అక్కడ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
ఏపీ రేట్లు ఇలా:
బెనిఫిట్ షో: డిసెంబర్ 11న వేసే షోకి రూ. 600 (జీఎస్టీతో కలిపి).
సాధారణ షోలు: రిలీజ్ తర్వాత 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ. 75, మల్టీప్లెక్స్లలో రూ. 100 అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించారు.
తెలంగాణలో మళ్లీ అదే సీన్ రిపీట్?
అసలు టెన్షన్ అంతా తెలంగాణలోనే ఉంది. రేపు ప్రీమియర్స్ పడాలంటే ఈరోజే (డిసెంబర్ 10) బుకింగ్స్ మొదలవ్వాలి. కానీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేక షోల జీవో ఇంకా రాలేదు. గతంలో డిసెంబర్ 5న రిలీజ్ అనుకున్నప్పుడు కూడా ఇలాగే చివరి నిమిషం వరకు జీవో రాక, ఆర్థిక ఇబ్బందులతో సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ అదే జరుగుతుందా అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. వెంటనే జీవో వచ్చేలా నిర్మాతలు చొరవ చూపాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు.

