తెలంగాణలోని బాలయ్య అభిమానులకు శుభవార్త! ఇన్నాళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 'అఖండ 2' టికెట్ రేట్ల పెంపు జీవో (G.O.) ఎట్టకేలకు వచ్చేసింది. ఇక బుకింగ్స్ మోత మోగడమే తరువాయి.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన 'అఖండ 2: తాండవం' (Akhanda 2) సినిమా డిసెంబర్ 12న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిస్తూ అధికారిక మెమో (నెం: 6593-P/General.A1/2025) జారీ చేసింది. డిసెంబర్ 12 నుంచి 14 వరకు (మూడు రోజులు) పెంచిన ధరలు అమల్లో ఉంటాయి.
టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే?
ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
సింగిల్ స్క్రీన్లు: ప్రస్తుత టిక్కెట్ ధరపై అదనంగా రూ. 50 (GSTతో సహా) పెంచుకోవచ్చు.
మల్టీప్లెక్స్లు: ప్రస్తుత ధరపై అదనంగా రూ. 100 (GSTతో సహా) పెంచుకోవచ్చు.
స్పెషల్ షో: డిసెంబర్ 11న రాత్రి 8.00 గంటలకు వేసే ప్రీమియర్/బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 600 (GSTతో సహా)గా నిర్ణయించారు.
సినీ కార్మికులకు గుడ్ న్యూస్!
ఈ జీవోలో ప్రభుత్వం ఒక కీలకమైన షరతు విధించింది. పెంచిన ధరల ద్వారా థియేటర్లకు వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తప్పనిసరిగా 'సినీ కార్మికుల సంక్షేమానికి' (Cine Workers Welfare) కేటాయించాలి. ఈ మొత్తాన్ని 'తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్' ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది.
ఏపీలో ముందే అనుమతి వచ్చినా, తెలంగాణలో ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ఇప్పుడు లైన్ క్లియర్ కావడంతో కొద్దిసేపట్లోనే తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

