కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే ఇకపై అందులో ఆ యాప్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే! కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త రూల్ గురించి తెలిస్తే మీరే మెచ్చుకుంటారు.
భారతదేశంలో మొబైల్ వినియోగదారుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో అమ్ముడయ్యే ప్రతి కొత్త స్మార్ట్ఫోన్లోనూ 'సంచార్ సాథీ' (Sanchar Saathi) యాప్ తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసి ఉండాలని మొబైల్ తయారీ కంపెనీలను ఆదేశించింది. దీని అమలుకు టెలికాం శాఖ (DoT) కంపెనీలకు 120 రోజుల గడువు ఇచ్చింది. ఫోన్ కొని సెటప్ చేసేటప్పుడే ఈ యాప్ స్క్రీన్ పై కనిపించాలి, అంతేకాదు దీన్ని డిలీట్ లేదా డిజిబుల్ (Disable) చేసే ఆప్షన్ కూడా వినియోగదారులకు ఉండదు.
ఒక్క యాప్.. ఎన్నో లాభాలు!
సైబర్ మోసాలు, ఐడెంటిటీ దొంగతనాలు, నకిలీ ఫోన్ల బెడదను అరికట్టడమే ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. ఈ ఒక్క యాప్ మీ ఫోన్లో ఉంటే సామాన్యులకు కలిగే ప్రయోజనాలు ఇవే:
ఒరిజినల్ లేదా ఫేక్: మీరు కొంటున్న ఫోన్ అసలైనదా లేక నకిలీదా అని IMEI నంబర్ ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు.
ఫోన్ పోతే బ్లాక్ చేయొచ్చు: ఒకవేళ మీ ఫోన్ దొంగిలించబడినా, పోయినా.. వెంటనే దాన్ని బ్లాక్ చేసి, ట్రాక్ చేయవచ్చు.
మీ పేరుపై ఎన్ని సిమ్ములు?: మీ ఆధార్పై మీకు తెలియకుండా వేరేవాళ్ళు ఎవరైనా సిమ్ కార్డులు వాడుతున్నారో లేదో చెక్ చేసుకోవచ్చు (TAFCOP).
ఫ్రాడ్ రిపోర్టింగ్: అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్లు వస్తే వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.
సెకండ్ హ్యాండ్ ఫోన్లకు రక్షణ
ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఫోన్లు కొనేవారికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. బ్లాక్ లిస్ట్లో ఉన్న ఫోన్లను, క్లోన్ చేసిన డివైజ్లను సులభంగా గుర్తించవచ్చు. కొత్త ఫోన్లలో ఇది తప్పనిసరి అయినా, ప్రస్తుతం పాత ఫోన్ వాడుతున్న వారు కూడా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని భద్రంగా ఉండవచ్చు.

