భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత హైకమిషన్ (Indian High Commission) కార్యాలయంపై ఓ ర్యాడికల్ గ్రూప్ దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భద్రతా కారణాల దృష్ట్యా బుధవారం (డిసెంబర్ 17) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఢాకాలోని ఎంబసీని మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా.. బంగ్లా భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయి.
వీసా అపాయింట్మెంట్స్ రద్దు..
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో వీసా సేవలపై ప్రభావం పడింది.
రీషెడ్యూల్ లేదు: డిసెంబర్ 17న వీసా కోసం అపాయింట్మెంట్ ఉన్న దరఖాస్తుదారులకు మరో తేదీని కేటాయించబోమని (No Reschedule), ఆ అపాయింట్మెంట్లు రద్దయినట్లేనని అధికారులు స్పష్టం చేశారు.
సమన్లు: ఎంబసీకి వస్తున్న బెదిరింపులు, అక్కడి నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలపై భారత్ సీరియస్ అయ్యింది. దీనిపై న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబారికి ఇప్పటికే సమన్లు జారీ చేసింది. మనం నిరసన తెలిపిన కొన్ని గంటల్లోనే ఈ దాడి యత్నం జరగడం గమనార్హం.
వ్యాపారంపై ఎఫెక్ట్..
గతేడాది షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేసి భారత్కు వచ్చినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇది వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
కేబుల్ టీవీ షో: కోల్కతాలో జరుగుతున్న 26వ కేబుల్ టీవీ షోకి బంగ్లాదేశ్ నుంచి హాజరయ్యే ప్రతినిధుల సంఖ్య భారీగా తగ్గింది.
వీసాల తిరస్కరణ: సాధారణంగా 400 మంది రావాల్సి ఉండగా.. వీసా ఆంక్షల వల్ల కేవలం 60 మందికే అనుమతి లభించిందని నిర్వాహకులు వాపోతున్నారు.
మత్స్యకారుడి దారుణ హత్య
మరోవైపు సముద్రంలోనూ బంగ్లాదేశ్ దుశ్చర్యలకు పాల్పడుతోంది. బంగ్లాదేశ్ సరిహద్దు జలాల సమీపంలో 'ఎఫ్బీ పరామిత-2' అనే భారతీయ పడవను బంగ్లా పెట్రోలింగ్ నౌక ఢీకొట్టింది.
ఈ ఘటనలో పడవ మునిగిపోవడమే కాకుండా.. రాజ్దుల్ అలీ షేక్ అనే మత్స్యకారుడిని పదునైన ఆయుధంతో పొడిచి దారుణంగా హత్య చేశారు.
ప్రాణాలతో బయటపడిన 11 మంది మంగళవారం నామ్ఖానాకు చేరుకోగా, మరో ఐదుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు.

