ధరలు మండిపోతున్నా భారతీయులకు బంగారంపై ఉన్న 'పిచ్చి' మాత్రం తగ్గడం లేదు. మన ఇళ్లలో ఉన్న బంగారం విలువ ఎంతో తెలిస్తే.. ప్రపంచ దేశాలు కూడా నోరెళ్లబెట్టాల్సిందే!
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, కొనుగోళ్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) నివేదిక ప్రకారం, ఈ ఏడాది జూన్ నాటికి భారతీయ కుటుంబాల వద్ద ఏకంగా 34,600 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. నగలు, బిస్కెట్లు, నాణేల రూపంలో ఉన్న ఈ పసిడి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 342 లక్షల కోట్లు. ఇది మన దేశ జీడీపీలో (GDP) దాదాపు 88.8 శాతానికి సమానం కావడం విశేషం.
నగలు కొంటే నష్టమే.. నిపుణుల వార్నింగ్!
గత ఏడాది కాలంలో బంగారం 60 శాతానికి పైగా లాభాలు ఇవ్వడంతో, జనం దీనిని ఒక బలమైన పెట్టుబడి మార్గంగా చూస్తున్నారు. అయితే, లాభాల కోసం బంగారం కొనేవారు ఆభరణాల (Jewelry) జోలికి వెళ్లకపోవడమే మంచిదని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ నివేదిక హెచ్చరిస్తోంది.
ఆభరణాలు ఎందుకు వద్దంటే:
రాళ్లు & రత్నాలు: నగల తయారీలో 30 నుంచి 35 శాతం వరకు రాళ్లు, రత్నాల విలువే ఉంటుంది. అమ్మేటప్పుడు వీటికి విలువ ఉండదు.
తరుగు & మజూరీ: దీనికి అదనంగా తరుగు (Wastage), తయారీ ఛార్జీలు (Making Charges) కలుపుకుంటే అసలుకే ఎసరు వస్తుంది.
లాభం రావాలంటే: ఈ ఖర్చులన్నీ పోయి మీకు లాభం రావాలంటే, బంగారం ధర ఏటా కనీసం 30 శాతం పెరగాల్సి ఉంటుంది. అది అంత సులభం కాదు.
అందుకే, కేవలం పెట్టుబడి కోసమే అయితే ఫిజికల్ గోల్డ్ (కడ్డీలు, నాణేలు) లేదా గోల్డ్ ఈటీఎఫ్లు (Gold ETFs), మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేయడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

