దావోస్కు మనం వెళ్లడం కాదు.. దావోసే మన దగ్గరకు కదిలివచ్చింది! హైదరాబాద్ వేదికగా సీఎం రేవంత్ సర్కార్ సృష్టించిన పెట్టుబడుల సునామీ చూసి పారిశ్రామిక వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' తొలిరోజే చరిత్ర సృష్టించింది. సోమవారం ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన ఈ సదస్సులో ఏకంగా 35కు పైగా దిగ్గజ సంస్థలు క్యూ కట్టాయి. కేవలం ఒక్కరోజే సుమారు రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం. రేవంత్ రెడ్డి దార్శనికతకు ఇది నిదర్శనమని అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశంసించారు.
ట్రంప్ కంపెనీ నుంచి రిలయన్స్ దాకా..
ఈ సదస్సులో అంతర్జాతీయ సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు ప్రకటించాయి. ప్రధాన హైలైట్స్ ఇవే:
ట్రంప్ మీడియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన 'ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్' రూ. 41 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. భవిష్యత్తులో దీన్ని లక్ష కోట్లకు పెంచుతామని ఆ సంస్థ ప్రకటించింది.
బ్రూక్ఫీల్డ్: గ్లోబల్ రీసెర్చ్, డీప్ టెక్ హబ్ కోసం బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి రూ. 75 వేల కోట్లు వెచ్చించనుంది.
విన్ గ్రూప్: పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 27,000 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది.
ఇంధన రంగానికి పెద్దపీట
మొత్తం పెట్టుబడుల్లో ఇంధన రంగానిదే (Energy Sector) హవా. ఇందులో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇక ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో జీఎంఆర్ గ్రూప్ రూ. 15,000 కోట్లు, అపోలో మైక్రో సిస్టమ్స్ రూ. 1,500 కోట్లు పెట్టనున్నాయి. అపోలో గ్రూప్ విద్య, వైద్య రంగాల్లో ఒప్పందాలు చేసుకోగా.. రిలయన్స్కు చెందిన 'వంతారా' కొత్త జూ పార్క్ ఏర్పాటుకు అంగీకరించింది.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించగా.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి హాజరయ్యారు. ఏఐ, ఐటీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో వచ్చిన ఈ అనూహ్య స్పందనతో సదస్సు ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

