ఇండిగో విమానాల రద్దు వ్యవహారంలో అసలు తప్పు ఎవరిది? ప్రభుత్వానిదా లేక సంస్థదా? ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చేశారు.
దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులను ముప్పుతిప్పలు పెడుతున్న ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ఈ గందరగోళానికి ప్రభుత్వ నిబంధనలు కారణం కాదని, అది పూర్తిగా ఇండిగో సంస్థ "అంతర్గత సమస్యే" అని కుండబద్దలు కొట్టారు. సిబ్బంది రోస్టరింగ్ (Rostering), ప్లానింగ్లో ఉన్న లోపాలే దీనికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
డిసెంబర్ 3 వరకు బాగానే ఉంది కదా?
రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు:
కొత్త రూల్స్ కారణం కాదు: విమాన సిబ్బంది పనివేళల పరిమితికి సంబంధించిన కొత్త నిబంధనలు అందరితో చర్చించిన తర్వాతే తెచ్చామని, డిసెంబర్ 3 వరకు సర్వీసులు బాగానే నడిచాయని గుర్తుచేశారు.
ధరలపై కన్నేశాం: ప్రయాణికుల ఇబ్బందులకు చింతిస్తున్నామని, టికెట్ ధరలను విమానయాన సంస్థలు అడ్డగోలుగా పెంచకుండా పరిమితులు విధించామని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని హామీ ఇచ్చారు.
విపక్షాల వాకౌట్..
అయితే, మంత్రి సమాధానంతో విపక్ష ఎంపీలు సంతృప్తి చెందలేదు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ గందరగోళం మధ్య సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను సీరియస్గా తీసుకున్నామని, పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెబుతోంది.

