విమానం టికెట్ రేటు చూస్తే గుండె ఆగిపోవాల్సిందే.. ఢిల్లీ వెళ్లాలంటే లక్ష రూపాయలు కట్టాలా? సామాన్యుల నడ్డి విరుస్తున్న ఎయిర్లైన్స్పై కేంద్రం కొరడా ఝుళిపించింది.
ఇండిగో విమానాలు వరుసగా రద్దవ్వడం ప్రయాణికులకు శాపంగా మారితే, మిగిలిన విమానయాన సంస్థలకు మాత్రం వరంగా మారింది. ఇదే అదనుగా భావించిన ఇతర కంపెనీలు టికెట్ ధరలను అమాంతం పెంచేసి, ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ పగటిపూట దోపిడీపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే స్పందించిన పౌర విమానయాన శాఖ, ఇండిగో సర్వీసులు రద్దయిన రూట్లలో టికెట్ ధరలను నియంత్రిస్తూ (Cap on Fares) కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.
రూ. 10 వేల టికెట్.. రూ. 60 వేలకు జంప్!
సాధారణ ధరల కంటే మూడు నుంచి పది రెట్లు అధికంగా టికెట్లు అమ్ముతుండటంతో అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. శుక్రవారం నాడు ప్రధాన నగరాల మధ్య నమోదైన విమాన టికెట్ ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి:
ఢిల్లీ - బెంగళూరు: టికెట్ ధర ఏకంగా రూ. 1,02,000.
చెన్నై - ఢిల్లీ: ధర రూ. 90,000 పైమాటే.
ముంబై - శ్రీనగర్: సాధారణంగా రూ. 10 వేలు ఉండేది, ఇప్పుడు రూ. 62,000 దాటింది.
ఢిల్లీ - ముంబై: టికెట్ రేటు రూ. 54,222 పలికింది.
డిమాండ్ పెరిగిందన్న సాకుతో ఇష్టారాజ్యంగా రేట్లు పెంచడాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా ఉన్న ఈ కృత్రిమ ధరల పెంపును కట్టడి చేసేందుకు కొత్త సీలింగ్ ధరలను నిర్ణయించింది. అన్ని ఎయిర్లైన్స్ ఈ ఆదేశాలను తప్పక పాటించాలని స్పష్టం చేసింది.

