"ఎవరి పని వారు చూసుకుంటే మంచిది".. వన్డే సిరీస్ గెలిచిన జోష్లో గౌతమ్ గంభీర్ ఇచ్చిన ఈ వార్నింగ్ ఎవరికో అర్థమైందా? ఆ ఐపీఎల్ ఓనర్కే! టెస్టు సిరీస్ ఓటమి తర్వాత నోరు పారేసుకున్న వారికి గంభీర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విమర్శకులపై విరుచుకుపడ్డాడు. విశాఖపట్నంలో జరిగిన చివరి వన్డేలో ఘన విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టెస్టు సిరీస్ ఓటమి తర్వాత తనపై, జట్టుపై వచ్చిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ముఖ్యంగా 'స్ప్లిట్ కోచింగ్' (ఫార్మాట్కు ఒక కోచ్) కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్ను పరోక్షంగా టార్గెట్ చేశాడు.
"మీ బిజినెస్ మీరు చూసుకోండి!"
జిందాల్ పేరు ప్రస్తావించకుండానే గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. "క్రికెట్తో ఏమాత్రం సంబంధం లేని వారు కూడా సలహాలు ఇచ్చేస్తున్నారు. ఒక ఐపీఎల్ ఓనర్ అయితే ఏకంగా కోచ్ల విభజన గురించి రాశారు. ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిది. నేను ఇతరుల విషయాల్లో, వ్యాపారాల్లో వేలు పెట్టనప్పుడు.. నా విషయంలో జోక్యం చేసుకోవడానికి వారికి హక్కు లేదు" అని గంభీర్ తేల్చిచెప్పాడు.
గిల్ లేకపోతే ఓడతామా? పిచ్ గొడవేంటి?
టెస్టు సిరీస్ ఓటమికి పిచ్లే కారణమంటూ జరిగిన ప్రచారంపైనా గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. "కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడటం వల్లే టెస్టుల్లో ఇబ్బంది పడ్డాం. కానీ ఆ విషయం ఎవరూ మాట్లాడలేదు. అందరూ పిచ్ గురించే చర్చించారు" అని ఆవేదన వ్యక్తం చేశాడు.
టీ20 సిరీస్కు గిల్ రెడీ!
ఇక డిసెంబర్ 9 నుంచి కటక్లో మొదలయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు శుభ్మన్ గిల్ అందుబాటులో ఉంటాడని గంభీర్ స్పష్టం చేశాడు. గిల్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని, అందుకే అతడిని ఎంపిక చేశామని తెలిపాడు.

