విమానాలు రద్దై ప్రయాణికులు కోపంతో ఊగిపోతుంటే.. ఒక పైలట్ చేసిన పని అందరి కోపాన్ని చల్లార్చింది. తమిళంలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ సమయంలో కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ (Captain Pradeep Krishnan) చూపిన చొరవ అందరి మనసు గెలుచుకుంది. తాను నడుపుతున్న విమానంలో ప్రయాణికుల సీట్ల వద్దకు నేరుగా వెళ్లి, ఆలస్యానికి తమిళంలో వినమ్రంగా క్షమాపణలు చెప్పారు. "మీకు కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని మన్నించండి, సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తాం" అని ఆయన చెప్పిన తీరుకు ప్రయాణికులు ఫిదా అయిపోయి చప్పట్లతో అభినందించారు.
మేమేమీ సమ్మె చేయడం లేదు..
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఆయన ఒక ఎమోషనల్ నోట్ రాశారు.
క్షమించండి: "ముఖ్యమైన పనులు వదులుకోవడం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి."
సమ్మె కాదు: "పైలట్లుగా మేం సమ్మె చేయడం లేదు. మేం కూడా మా ఇళ్లకు వెళ్లాలనుకుంటున్నాం."
రిక్వెస్ట్: విమానాశ్రయాల్లోని గ్రౌండ్ స్టాఫ్తో దయతో మెలగాలని, వారిపై కోపం చూపించవద్దని ఆయన ప్రయాణికులను కోరారు.
ఏడో రోజుకు చేరిన సంక్షోభం
కొత్త పైలట్ విశ్రాంతి నిబంధనల వల్ల సిబ్బంది కొరత ఏర్పడి ఇండిగో సంక్షోభం ఏడో రోజుకు చేరింది. ఆదివారం ఏకంగా 650కి పైగా విమానాలు రద్దు కాగా, సోమవారం కూడా 150కి పైగా సర్వీసులు ఆగిపోయాయి. ఈ క్లిష్ట సమయంలో సదరు పైలట్ చూపిన మానవత్వంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

