ఇడ్లీ, సాంబార్, నాటు కోడి కూర.. వీటి సాక్షిగా కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఆ ఇద్దరు నేతల మధ్య దోస్తీ వెనుక అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు.
కర్ణాటకలో 'బ్రేక్ఫాస్ట్ పాలిటిక్స్' (Breakfast Politics) రసవత్తరంగా సాగుతున్నాయి. డిసెంబర్ 2న (మంగళవారం) సీఎం సిద్ధరామయ్య స్వయంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి వెళ్లి 'బ్రేక్ఫాస్ట్ మీట్ 2.0'లో పాల్గొన్నారు. పార్టీలో నాయకత్వ విభేదాలు భగ్గుమంటున్నాయన్న ప్రచారానికి చెక్ పెట్టేందుకే ఈ భేటీ జరిగినట్లు స్పష్టమవుతోంది. డిసెంబర్ 8న ప్రారంభమయ్యే బెళగావి అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇద్దరి మధ్య ఐక్యతను చాటాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా సూచించినట్లు సమాచారం.
ఈ రాజకీయ విందులో వడ్డించిన మెనూ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరూ కలిసి ఆరగించిన పదార్థాలు ఇవే:
వేడి వేడి ఇడ్లీ, సాంబార్.
ఉప్మా.
నోరూరించే నాటు కోడి కూర.
"మేం అన్నదమ్ముల్లాంటి వాళ్లం"
పుకార్లకు చెక్ పెడుతూ ఇద్దరు నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము "అన్నదమ్ముల్లా" కలిసి పనిచేస్తున్నామని, పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి గందరగోళం లేదని, విపక్షాలను సమైక్యంగా ఎదుర్కొంటామని సీఎం సిద్ధరామయ్య కూడా ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం సగం కాలం పూర్తి చేసుకున్న వేళ, ఈ 'టిఫిన్ దోస్తీ' క్యాడర్లో కొత్త జోష్ నింపుతోంది.

