రాష్ట్రపతి భవన్లో పుతిన్ విందు.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి నో ఎంట్రీ! కానీ అదే పార్టీకి చెందిన మరో నేతకు మాత్రం రెడ్ కార్పెట్ పరిచారు.
భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక విందు (Dinner) ఇస్తున్నారు. అయితే, ఈ హై-ప్రొఫైల్ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు గానీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి గానీ ఆహ్వానం అందలేదు. కానీ, ఆశ్చర్యకరంగా అదే పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్కు మాత్రం పిలుపు వచ్చింది.
"నాకు తెలియదు.. కానీ వెళ్తా!"
దీనిపై శశిథరూర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతను ఆహ్వానించని విషయం తనకు తెలియదని, అయితే ఆహ్వానం వచ్చింది కాబట్టి తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశారు. అసలు ఏ ప్రాతిపదికన తనను పిలిచారో, ఎందుకు ఆహ్వానం పంపించారో కూడా తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
మోదీకి మద్దతే కారణమా?
ఇటీవల 'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం పంపిన ఎంపీల బృందంలో థరూర్ ఉన్నారు. అంతేకాదు, కొన్ని కీలక సందర్భాల్లో ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటంతో సొంత పార్టీలోనే ఆయనపై విమర్శలు వస్తున్నాయి. అయితే, గతంలో ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా పనిచేసిన అనుభవం, రష్యా అధికారులతో ఉన్న పాత పరిచయాల కారణంగానే ఆయనకు ఈ ఆహ్వానం దక్కి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

