దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మునిగి ఉంటే.. బులియన్ మార్కెట్ మాత్రం సామాన్యుడిపై పెద్ద బాంబ్ వేసింది. ఉదయం లేవగానే బంగారం రేట్లు చూసి "అమ్మయ్య పెద్దగా పెరగలేదు, ఇంకాస్త తగ్గాయి" అని ఊపిరి పీల్చుకున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. గంటల వ్యవధిలోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ. 2 వేలకు పైగా, కిలో వెండిపై ఏకంగా రూ. 5 వేలు పెరగడం చూస్తుంటే.. అసలు ఇక సామాన్యుడు బంగారం కొనే రోజులు పోయాయా అనిపిస్తోంది. ఈ సడెన్ స్పైక్ వెనుక అసలు కారణం ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఉదయం కూల్.. మధ్యాహ్నం హాట్
నిజానికి గణతంత్ర దినోత్సవం రోజు ఉదయం 6 గంటల సమయానికి బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు, పైగా 10 రూపాయలు తగ్గింది. ఇది చూసి చాలా మంది ఊరట చెందారు. కానీ మార్కెట్ అప్డేట్ అయ్యే సమయానికి (ఉదయం 10-11 గంటల మధ్య) పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 2,450, 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,250 మేర పెరిగి కొనుగోలుదారులకు చుక్కలు చూపించింది. ఇక వెండి అయితే ఏకంగా కిలోపై రూ. 5,000 ఎగబాకింది. గంటల వ్యవధిలోనే ఇంత భారీ మార్పు రావడం మార్కెట్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది.
హైదరాబాద్ లో తాజా రేట్లు
ఈ భారీ పెరుగుదలతో హైదరాబాద్ మార్కెట్ లో ధరలు ఆల్-టైమ్ రికార్డులను తాకుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,62,710 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,49,150 కి చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,22,030 గా నమోదైంది. వెండి విషయానికి వస్తే, కిలో ధర రూ. 3,75,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ వేగం చూస్తుంటే మరికొద్ది రోజుల్లోనే వెండి కిలో 4 లక్షల మార్కును దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. సామాన్యుడికి వెండి కూడా అందనంత ఎత్తులో ఉందనడంలో సందేహం లేదు.
ప్రపంచం భగ్గుమంటోంది.. అందుకే రేట్లు ఇలా
ఈ రేట్లు ఇలా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ రాజకీయాల్లో నెలకొన్న గందరగోళమే. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, అనిశ్చితి నెలకొనడంతో మదుపర్లు సురక్షిత పెట్టుబడి కోసం బంగారం వైపు చూస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర 5,000 డాలర్ల మార్కును దాటి, ప్రస్తుతం 5,040 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గత రెండేళ్లలో బంగారం ధర రెట్టింపు కావడం గమనించదగ్గ విషయం. ఎప్పుడైతే మార్కెట్లలో భయం ఉంటుందో, అప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుందనే చారిత్రక సత్యం మరోసారి రుజువైంది.
ప్రస్తుతం మార్కెట్ అత్యంత అస్థిరంగా ఉంది. అత్యవసరం అయితే తప్ప ఇప్పుడు బంగారం జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఈ రేట్లు చూస్తుంటే పెళ్లిళ్ల సీజన్ లో సామాన్యుల పరిస్థితి ఏంటనేది ఆందోళనకరం.

